- మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు : మక్తల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని 7వ వార్డులో మశమ్మ దేవాలయం నుంచి అయ్యప్పస్వామి ఆలయం వరకు రూ.25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి భూమిపూజ చేశారు. మక్తల్ మున్సిపాలిటీలోని చందాపూర్ గ్రామంలో రూ.90 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధే తమ లక్షమన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో రూ.1035 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని రెండు ప్రాంతాల్లో రూ.1. 15 కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశామన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్ లైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
అభివృద్ధిని కోరుకునే వారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం రూ.70 కోట్లతో నిర్మించనున్న 220 కేవీ సబ్ స్టేషన్ కోసం స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ సతీశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఇంజినీర్ నాగశివ, కాంగ్రెస్ నాయకులు గవినోళ్ల బాలకృష్ణారెడ్డి, కట్టా సురేశ్ కుమార్ గుప్తా, గణేశ్ కుమార్, బోయ రవికుమార్, కోళ్ల వెంకటేశ్, సాలంబిన్ ఉమర్ బస్రవి, నీల గౌడ్, గోవర్ధన్, కావాలి శ్రీహరి, వల్లంపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
