
ఫేస్ బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ కు వెళ్లిన రాజస్థాన్ కు చెందిన వివాహిత అంజూ అలియాస్ ఫాతిమా అక్కడ ఎలా ఉందో ఏమో కానీ ఆమె కుటుంబం మాత్రం ఇక్కడ రోడ్డున పడిపోయింది. అంజూ కుటుంబం స్థానికంగా చాలా ఇబ్బందులు ఎదురుకుంటుంది. అంజూ పాకిస్థాన్ కు వెళ్లిపోయాక స్థానికులు ఆమె కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. మొదట జాలి పడిన వారే ఇప్పుడు దూరం పెడుతున్నారు. అంజూ ఫాదర్ గయా ప్రసాద్ థామస్ తన గ్రామంలో బట్టలు కుట్టుకుంటాడు. అయితే అంజూ నిర్వాకం తరువాత తనకు ఎవరు కూడా ఉపాధిని కల్పించడం లేదని వాపోతున్నాడు. అంతేకాకుండా స్థానికులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టైలరింగ్ వ్యాపారం ఆగిపోయిందని తెలిపాడు.
ఇక అంజూ సోదరుడు డేవిడ్ థామస్ , మొదటి భర్త అరవింద్ మీనా పరిస్థితి కూడా అలాగే ఉందట. వీరు తమ జాబ్స్ ను కోల్పోయారు. అంజూ సోదరుడు డేవిడ్ ఓ ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేస్తున్నాడు. అంజూ వ్యవహారం తర్వాత తాను పనిచేసే సంస్థ డేవిడ్ను ఇంటివద్దే ఉండమని చెప్పేసిందట. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇంట్లో ఉండాలని కంపెనీ పేరును ఎక్కడా ప్రస్తావించవద్దని ఆర్డర్ వేసిందట. ఇక అంజూ భర్తను కూడా ఆయన పనిచేసే కంపెనీ బెంచ్కే పరిమితం చేసిందట. ఏ పని అప్పగించడం లేదట.
ఉత్తరప్రదేశ్లోని కైలోర్ గ్రామంలో జన్మించి రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉంటున్న అంజూ (34) 2019లో ఫేస్బుక్లో 29 ఏళ్ల పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాతో స్నేహం చేసింది. అతడితో స్నేహం పెళ్లికి దారి తీసింది. అంజు ఇస్లాం మతంలోకి మారి ఇప్పుడు ఫాతిమా అనే కొత్త పేరు పెట్టుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉంది. అంజూకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంజూ తల్లిదండ్రులు హిందువుల నుంచి క్రిస్టియన్లోకి మారారు. నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ అక్కడ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకుంది.