తిరుమల కొండపై వేణుగోపాలస్వామి ఆలయంలో టికెట్ విధానం : ఇదేం అన్యాయం అంటున్న పీఠాధిపతి విజయశంకర్

తిరుమల కొండపై వేణుగోపాలస్వామి ఆలయంలో టికెట్ విధానం : ఇదేం అన్యాయం అంటున్న పీఠాధిపతి విజయశంకర్

ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమలలో వరుసగా వివాదాలు వెలుగులోకి వస్తుండటం కలవరపెడుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి మొదలు.. మొన్న క్యూలైన్లో సౌకర్యాల కొరత పట్ల భక్తుల నిరసన వరకు తలెత్తిన వివాదాలు స్వామివారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు తిరుమలలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది.. తిరుమలలోని వేణుగోపాల స్వామి ఆలయంలో డబ్బులు ఇస్తేనే దర్శనం అంటూ... టికెట్లు అమ్ముతుండటం వివాదానికి దారి తీసింది.

ALSO READ | జులై 4 నుంచి నందలూరు సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు...

కొండపై ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో డబ్బులు చెల్లించినవారికే దర్శనానికి అనుమతి ఇస్తున్నారంటూ అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయశంకర స్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువారం ( జూన్ 26 ) మీడియా సమక్షంలో ఆలయ అధికారులను నిలదీశారు స్వామివారు. వేణుగోపాల స్వామివారి దర్శనం చేసుకోవాలంటే రూ. ఐదు, త్వరగా దర్శనం చేసుకోవాలంటే రూ. 10 చెల్లించాలని టికెట్లు అమ్మడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశంకర స్వామి. 

దైవదర్శనానికి టిక్కెట్లు అమ్మడం మహా పాపమని, అన్యాయమని, దైవద్రోహమని... ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు విజయశంకర స్వామి. డబ్బులుంటేనే దర్శనం అనే ధోరణి వల్ల హిందువులలో భక్తి సన్నగిల్లుతున్నదనీ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ టికెట్ల విధానాన్ని రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు విజయశంకర స్వామి.