- గంధం ఊరేగింపులో పాల్గొన్న భక్త జనం...- దర్గాలో ప్రముఖుల ప్రార్థనలు
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా దర్గా ప్రధాన ముజేవార్ బోలేషావళి ఇంటివద్ద ముజేవార్లు పాషా, గౌష్పాషా, ఖాజాపాషా తదితరులు ‘సంథల్’ (గంధం) పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య సలాం పాటలతో ఊరేగింపు ప్రారంభమైంది.
ఇందులో ఖవాలీ, ఫకీర్ల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళికి గంధం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు యాకూబ్బాబా దర్గాతో పాటు గౌష్పాక్, మహాబూబీమా, బోలేషావాలి, గుంషావళి దర్గాలవద్ద భక్తులు తమ మొక్కులు సమర్పించుకున్నారు. దర్గా ప్రాంగణంలో వక్ఫ్బోర్డు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గాడిపెల్లి మహేందర్, మాజీ సొసైటీ చైర్మన్ మనోజ్గౌడ్, మాజీ మండల కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్, పాషా, గౌష్, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల పూజలు..
అన్నారం దర్గాలో సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, మామునూర్ ఏసీపీ వెంకటేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
