
- ‘వాహన్’ పోర్టల్లో మన వెహికల్స్ ఎంట్రీ కాకపోవడమే కారణం
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన యాన్యువల్ టోల్పాస్ స్కీమ్.. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్’ పోర్టల్లో తెలంగాణ వెహికల్స్ నమోదు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తున్నది.
పంద్రాగస్టును పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం యాన్యువల్ టోల్ పాస్ ను తీసుకొచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. రూ.3వేలు కడితే ఏడాదిలో 200 సార్లు టోల్గేట్లు క్రాస్ అవ్వొచ్చు. సగటున ఒక్కో టోల్గేట్ వద్ద రూ.15 కట్ అవుతాయి. ఇప్పటికే ఫాస్టాగ్ కలిగి ఉన్న వాహనదారులు మాత్రమే ఈ పాస్ పొందొచ్చు. వెంటనే తెలంగాణ వాహనాలను వాహన్ డేటాబేస్లో నమోదు చేయించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
ఏమిటీ వాహన్ డేటాబేస్?
వాహన్ డేటాబేస్ అంటే.. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కేంద్రీకృత వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాబేస్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల (ఆర్టీవో) నుంచి వాహన్ రిజిస్ట్రేషన్ డేటాను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. వెహికల్ ఓనర్ పేరు, రిజిస్ట్రేషన్ తేదీ, వెహికల్ టైప్, ఫ్యూయెల్ టైప్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు వంటి అన్ని వివరాలను వాహన్ డేటాబేస్లో ఉంటాయి.
ఈ పోర్టల్ ద్వారా వెహికల్స్కు సంబంధించిన సమాచారం పరిశీలించడం, ట్యాక్స్లు, ఫీజులు, పెండింగ్ చలాన్లు వంటి వివరాలను తెలుసుకోవడం ఈజీ అవుతుంది. చాలా రాష్ట్రాలు తమ వాహనాల సమాచారాన్ని ఇప్పటికే వాహన్ డేటాబేస్తో అనుసంధానించాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలంగాణ ఇంకా తన వాహనాల డేటాను పూర్తిగా ఇందులో చేర్చలేదు. దీని ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు, రాయితీలు ఇక్కడి వాహనాలకు వర్తించడం లేదు.