న్యూఢిల్లీ: దేశీయ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రష్యా నుంచి అత్యాధునిక ఎస్ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి మూడు ఎస్400 స్క్వాడ్రన్లు అందగా, నాలుగో స్క్వాడ్రన్ ఈ ఏడాది మే నెలకు అందనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘ఆపరేషన్ సిందూర్’మొదటి వార్షికోత్సవం సందర్భంగా దీనిని డెలివరీ చేయనున్నట్లు తెలిసింది.
మొత్తం ఐదు ఎస్ 400 స్క్వాడ్రన్ల కోసం 2018లో రష్యాతో భారత్ సుమారు రూ.35 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు భారత్కు అందగా, వాటిని పలు కీలక ప్రాంతాల్లో మొహరించారు. పంజాబ్ సరిహద్దుల్లో మరొకటి, రాజస్తాన్, గుజరాత్ సరిహద్దుల్లో ఇంకో స్క్వాడ్రన్ను మోహరించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఎస్400 స్క్వాడ్రన్లు.. శత్రువుల ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్లను నాశనం చేయగలవు. అలాగే, 4 రకాల క్షిపణుల సహాయంతో 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ప్రతి స్క్వాడ్రన్లో క్షిపణి లాంచర్లు, రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్లు సహా 16 వెహికల్స్ ఉంటాయి.
