- వ్యక్తిగత కారణాలతోనే అంటున్న వర్సిటీ అధికారులు
- హాజరు శాతం లేదని పేరెంట్స్కు ఫోన్ చేసిన వర్సిటీ ఆఫీసర్లు
- ఇంటికి తీసుకెళ్లమని చెప్పడంతో మనస్తాపంతోనే సూసైడ్?
భైంసా/బాసర, వెలుగు : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెందిన అరవింద్ బాసర ట్రిపుల్ఐటీలో పీయూసీ సెకండ్ఇయర్చదువుతున్నాడు. మంగళవారం తోటి స్టూడెంట్స్ క్లాస్లకు వెళ్లగా..అరవింద్ హాస్టల్గదిలోనే ఉండిపోయాడు. తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతులు పూర్తయిన తర్వాత తోటి విద్యార్థులు హాస్టల్ గదికి రాగా.. అరవింద్ వేలాడుతు కనిపించాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వర్సిటీ ఆఫీసర్లు చెబుతున్నారు. ముథోల్ సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అటెండెన్స్ శాతం తక్కువే కారణమా?
అరవింద్ పీయూసీ- సెకండ్ ఇయర్ చదువుతుండగా ఈ నెల17 నుంచి పరీక్షలున్నాయి. వర్సిటీ ఆఫీసర్లు 75 పర్సెంట్అటెండెన్స్ఉన్న స్టూడెంట్స్ను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తున్నారు. రెండు రోజుల క్రితం హాజరు శాతం తక్కువగా ఉన్న వంద మందికి పైగా విద్యార్థుల లిస్ట్ను కాలేజీ నోటీస్బోర్డుపై పెట్టారు. ఇందులో పేర్లున్న స్టూడెంట్ల పేరెంట్స్కు ఫోన్లు చేసి ఇండ్లకు తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. ఇందులో అరవింద్ పేరు కూడా ఉండడం, వారి పేరెంట్స్కు కూడా చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు నెలల్లో ముగ్గురు
ట్రిపుల్ఐటీలో గత ఐదు నెలల్లో ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. గత ఏడాది నవంబర్లో ఫస్ట్ఇయర్ చదువుతున్న నాగర్కర్నూల్కు చెందిన ప్రవీణ్కుమార్, ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన పీయూసీ- ఫస్టియర్చదువుతున్న శిరీషా హాస్టల్గదుల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా అరవింద్కూడా ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇన్చార్జి వీసీ వెంకటరమణ హైదరాబాద్లో ఉంటూ నెలకు ఒకటి, రెండు సార్లు వచ్చి పోతుండడం, ఇంతకు ముందు డైరెక్టర్ సతీశ్కుమార్పదవీ కాలం ముగియడంతో పర్యవేక్షణ కరువైందంటున్నారు.
కలెక్టర్, ఎస్పీ సీరియస్..
ఆత్మహత్య విషయం తెలియడంతో నిర్మల్కలెక్టర్ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ జానకి షర్మిల ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. అరవింద్గదిని పరిశీలించారు. వర్సిటీ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి క్లాస్రూమ్కు వెళ్లకుండా హాస్టల్గదిలో ఉంటే వార్డెన్ ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థి అటెండెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఔట్పాస్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆత్మహత్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనలు, తీసుకున్న చర్యలపై రిపోర్ట్ అందజేయాలన్నారు. స్టూడెంట్స్ను గ్రూపులుగా విభజించి, వారికి ఒక ఫ్యాకల్టీని కేటాయించాలన్నారు. బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ట్రీపుల్ఐటీ అధికారులు మహేష్, చంద్రశేఖర్, పావని, వినోద్, శ్రీధర్ పాల్గొన్నారు.