అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ భద్రాజీ రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారు. కొత్త రథం నిర్మాణంతోపాటు.. దాన్ని ఉంచే షెడ్డును కూడా మరమ్మతులు చేయాలని.. దీనికి ఇనుప షట్టర్ అమర్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికి రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవాదాయశాఖ ఈఈ శేఖర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. దగ్ధమైన రథానికి రూ.84 లక్షల బీమా ఉన్నా.. ఆ సొమ్ము రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే వీలైనంత త్వరగా ప్రభుత్వ నిధులతో రథం నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా రథాన్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆలయ సహాయ కమిషనర్ భద్రాజీ తెలిపారు.