- ఈజీగా లీగల్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ పనులు
బిజినెస్ డెస్క్, వెలుగు: అమెరికా టెక్ కంపెనీ ఆంత్రోపిక్ తీసుకొచ్చిన ఏఐ టూల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. మనుషుల్లా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, కష్టతరమైన పనులను చేసిపెట్టడం వీటి ప్రత్యేకత. దీని కొత్త ఏజెంటిక్ ఏఐ టూల్ క్లోడ్ కోవర్క్తో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) ఇండస్ట్రీ ఖతమవుతుందనే భయాలు పెరిగాయి. లక్షలాది జాబ్స్ పోతాయని, ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ప్రాజెక్ట్లపై ఆధారపడే ఇండియన్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ ఆంత్రోపిక్ తెచ్చిన కొత్త టూల్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? గ్లోబల్ ఐటీ కంపెనీలతో పాటు ఇండియన్ కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయో చూద్దాం.
అన్ని పనులూ ఈజీగా
ఏఐ కంపెనీ ఆంత్రోపిక్ తన ఏజెంటిక్ ఏఐ క్లోడ్ కోవర్క్ అప్గ్రేడెడ్ వెర్షన్ను తాజాగా లాంచ్ చేసింది. యూజర్ అడిగిన ప్రశ్నకు మనిషిలా సమాధానం చెప్పడమే కాకుండా, పర్మిషన్ ఇస్తే ఫోల్డర్లోని ఫైల్స్ను చదివి ఎడిట్ చేస్తుంది. క్రియేట్, రీనేమ్ వంటి పనులు చేయగలుగుతుంది. ఈ ఏఐ కంపెనీ 11 ప్లగిన్లను కూడా కోవర్క్తో తీసుకొచ్చింది. వీటితో కంపెనీలు మార్కెటింగ్, లీగల్, కస్టమర్ సపోర్ట్ వంటి ప్రత్యేకమైన పనులనూ పూర్తి చేసుకోవచ్చు. ఉదాహరణకు లీగల్ ప్లగిన్తో డాక్యుమెంట్లను రివ్యూ చేసుకోవచ్చు. మార్కెటింగ్ ప్లగిన్తో బ్రాండ్ కంటెంట్ను తయారు చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ ప్లగిన్తో యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆటోమేటిక్గా సమాధానాలు ఇవ్వవచ్చని ఆంత్రోపిక్ చెబుతోంది.
కంపెనీల్లో భయం..
కాంట్రాక్ట్లను రివ్యూ చేయడం, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ (ఎన్డీఏ) వెరిఫికేషన్, రూల్స్ చెకింగ్, లీగల్ బ్రీఫింగ్ వంటివి లీగల్ ప్లగిన్స్ చేయగలుగుతున్నాయి. ఈ టూల్ లీగల్ సలహాలు ఇవ్వదని, లాయర్స్ రివ్యూ అవసరమని ఆంత్రోపిక్ ఆంటోంది. ఏఐ ఇలాంటి సంక్లిష్టమైన ఆఫీస్ పనులను కూడా చేస్తే, లీగల్ సాఫ్ట్వేర్లు, సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్లకు డిమాండ్ తగ్గిపోతుందనే భయాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఏఐ కంపెనీలు మోడల్స్ను మాత్రమే అమ్మేవి. వీటి ఆధారంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రొడక్ట్లను, వర్క్ఫ్లోలను డెవలప్ చేసేవి. ఆంత్రోపిక్ దెబ్బకు ఏఐ కంపెనీలే డైరెక్ట్గా వర్క్ఫ్లోను మేనేజ్ చేసే స్థాయికి చేరుకున్నాయి. థామ్సన్ రాయిటర్స్, సేల్స్ఫోర్స్, డాక్యుసైన్ వంటి గ్లోబల్ కంపెనీలు చేసే పనులను ఇక నుంచి ఏఐ ద్వారా డైరెక్ట్గా చేసుకోవచ్చు.
ఉద్యోగాలకు ఎసరు..
ప్రస్తుతం ఇండియన్ ఐటీ సెక్టార్లో 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేవలం 2,500 మంది ఉద్యోగులు ఉన్న ఆంత్రోపిక్ వీరికి నిద్రలేకుండా చేస్తోంది. దీని మార్కెట్క్యాప్350 బిలియన్ డాలర్లకు చేరింది. ఆటోమేషన్ వల్ల డేటా ప్రాసెసింగ్, లీగల్ బ్యాక్ ఆఫీస్, మార్కెటింగ్ వంటి సెగ్మెంట్లలో భారీగా ఉద్యోగాలు పోవచ్చు. ఇలాంటి పనుల కోసం ఇప్పటి వరకు ఔట్సోర్సింగ్ కంపెనీలపై ఆధారపడిన సంస్థలు, ఏఐతో ఈ పనులను చేసుకుంటాయి. ఇండియా, ఫిలిప్పీన్స్, తూర్పు యూరప్లోని ఐటీ సర్వీస్ ప్రొవైడర్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటివి నియామకాలను తగ్గించాయి కూడా.
రూ.22.5లక్షల కోట్లు ఆవిరి..
ఆంత్రోపిక్ దెబ్బకు ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. ఇండియన్ ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ బుధవారం రూ.1.9 లక్షల కోట్లు తగ్గగా, గ్లోబల్గా రూ.23 లక్షల కోట్ల లాస్ వచ్చింది. ఆంత్రోపిక్పై ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఐటీ సర్వీస్లు, కన్సల్టింగ్ కంపెనీలపై మాత్రమే ప్రభావం కనిపిస్తోంది. క్లోడ్స్ కోవర్క్ కొత్త టూల్ టెక్నాలజీలో ఒక కొత్త మార్పు మాత్రమే. ఇలాంటివి ఐటీ సెక్టార్ను ముందుకే తీసుకెళతాయి.
-టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి
