
ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ సైంటిస్టుల తయారీ
యూధుల మైండ్సెట్తోనే సాధ్యమైందన్న ఇజ్రాయెల్ మంత్రి
మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామన్న నెదర్లాండ్స్ సైంటిస్టులు
జెరూసలేం: కరోనా పనిపట్టే యాంటీబాడీ రెడీ అయిపోయింది. ఇటు ఇజ్రాయెల్ సైంటిస్టులు, అటు నెదర్లాండ్స్ సైంటిస్టులు కరోనా విరుగుడును తయారు చేశారు. రెండు దేశాల సైంటిస్టులు తయారు చేసిన ఆ విరుగుడు ‘ఒకటే రకం’! మనిషి నుంచి తీసిన మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అవి. దానికి పేటెంట్ కోసం ఇజ్రాయెల్ ట్రై చేస్తుంటే, దానిని మరింత అభివృద్ధి చేసేందుకు నెదర్లాండ్స్ కృషి చేస్తోంది. ఈ ఘనత సాధించింది ఇజ్రాయెల్లోని ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్), నెదర్లాండ్స్లోని యుట్రెచ్ యూనివర్సిటీకి చెందిన ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెడ్ సైంటిస్టులు.
మోనోక్లోనల్ పద్ధతిలోనే ఈ యాంటీబాడీలు పనిచేస్తాయని, వైరస్ను చంపేస్తాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నఫ్తాలీ బెన్నెట్ ప్రకటించారు. దీనిపై పేటెంట్కు అప్లై చేస్తామని, దానిని కమర్షియల్గా తయారు చేసేందుకు వివిధ కంపెనీలతో మాట్లాడతామని ఆయన చెప్పారు. ‘యూధుల మైండ్సెట్, వాళ్ల క్రియేటివిటీతోనే ఇది సాధ్యమైంది’ అని అన్నారు. అయితే, మార్చిలోనే దీనికి సంబంధించి సైంటిస్టులు ఓ మంచి పద్ధతిని గుర్తించారని అక్కడి పేపర్ ఓ వార్త రాసింది. ఇప్పుడు బెన్నెట్ చెప్పిన ఈ యాంటీబాడీ అదేనా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మనుషులపై ట్రయల్స్ గురించి కూడా ఆయన వెల్లడించలేదు.
ల్యాబ్లో సక్సెస్
నెదర్లాండ్స్ సైంటిస్టులు తయారు చేసింది కూడా సేమ్ అలాంటి యాంటీ బాడీనే. అయితే, దీనిపై ఇప్పటిదాకా ల్యాబ్లోనే సైంటిస్టులు టెస్ట్ చేశారు. కల్చర్డ్ సెల్లో దానిని ప్రయోగించారు. అందులో వైరస్ను యాంటీబాడీ చంపేసినట్టు గుర్తించారు. ఈ యాంటీబాడీలతో వైరస్ సోకినోళ్లలో అది మరింత పెరగకుండా కాపాడొచ్చని, ఇతరులకు వ్యాపించుకుండా చూడొచ్చని యుట్రెచ్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. ఈ యాంటీబాడీతో భవిష్యత్తులో కరోనాకు మంచి ట్రీట్మెంట్ను అందించొచ్చన్నారు. దీనిపై ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.