హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు ఏపీ 45 టీఎంసీలు, తెలంగాణ 35 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతిస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల 6న నిర్వహించిన కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఈ ఆర్డర్ ఇచ్చారు. ఏపీ.. నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు వినియోగించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ 2 ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీల విని యోగానికి అనుమతిచ్చారు.
కృష్ణా బేసిన్లో ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు దాకా ఏపీ 95.72 టీఎంసీలు, తెలంగాణ 48.54 టీఎంసీలు ఉపయోగించుకున్నట్టు గుర్తించారు. కృష్ణా బేసిన్లో వర్షాలు లేక ప్రాజెక్టులకు సరైన ప్ర వాహాలు రాలేదు. దీంతో సాగు, తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి నీటిని డ్రా చేసే మట్టాన్ని 805 అడుగులు, సాగర్ ఎండీడీఎల్ను 505 అడుగులకు తగ్గించారు.
ఈ లెక్కన శ్రీశైలంలో 55.25, సాగర్లో 27.53 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, ఈ 82.78 టీఎంసీల్లో 2.78 టీఎంసీలను వచ్చే ఏడాది జులై నెలాఖరు దాకా తాగునీటికి కోసం రిజర్వ్ చేశామని తెలిపారు. రెండు రిజర్వాయర్లలో ఎండీడీఎల్ మెయింటేన్ చేస్తూ నీటిని తీసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయన్నారు.