సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

సరైన సమయంలో పొత్తులపై  నిర్ణయం : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా... బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. 

 అమిత్ షా పొత్తు కామెంట్లపై ఆమె స్పందించారు. బీజేపీ తన ప్రస్థానాన్ని ఇద్దరు ఎంపీలతో ప్రారంభించిందన్నారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పని చేస్తున్నారని  ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 

పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళతామని, ఎప్పటికప్పుడు సమయానుకూలంగా తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. కేవలం పొత్తులపైనే ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పురందేశ్వరి స్పష్టం చేశారు. తమ ప్రయత్నాలన్నీ పార్టీ బలోపేతం కోసమేనని ఉద్ఘాటించారు. దేశంలో 2014కి ముందు స్కాంల పర్వం ఉండేదని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారతదేశ రూపురేఖలే మారిపోయాయని పురందేశ్వరి కొనియాడారు.