మేం చనిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి రైతుల లేఖ

మేం చనిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి  రైతుల లేఖ

అమరావతి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు రైతులు. సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని లేఖలో తెలిపారు. కేవలం సీఎం, పలువురి స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. 14 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నా తమ గోడు వినిపించుకున్నవారు లేరని లేఖలో రాజధాని రైతులు వాపోయారు. ‘అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు.. మాకు మరణమే శరణ్యం. మా యందు దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో రాజధాని రైతులు పేర్కొన్నారు.