వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని 

అమరావతి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బ తిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను సీఎం పరిశీలించారు. భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేసి వీలైనంత వేగంగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే.. రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 రకాల నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్‌ అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.