
ఏపీలో మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది. సిక్కు మతస్థుల కోసం..వారి అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్నారు జగన్. ఏపీలో నివసించే సిక్కు మతస్థుల కోసం సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో ఉండే సిక్కుపెద్దలతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు సీఎం జగన్..ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్జిత్ సింగ్ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు..
సిక్కు కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్
ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు సిక్కు పెద్దలు.. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గురుద్వారాలకు పన్ను మినహాయింపు
గురుద్వారాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తికి కూడా సీఎం జగన్ ఆమోదం తెలిపారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… పూజారులు, పాస్టర్లు, మౌల్వీల్లానే ప్రయోజనాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు దినంగా ప్రకటించేందుకు కూడా అంగీకారం తెలిపారు సీఎం జగన్. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని తనను కలిసిన సిక్కు పెద్దలకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..