రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న  క్రికెటర్ రాయుడు .... గుంటూరు నుంచి పోటీ చేస్తారా?

రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న  క్రికెటర్ రాయుడు .... గుంటూరు నుంచి పోటీ చేస్తారా?

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అంబటి రాయుడు జగన్ ను కలవడానికి ఎందుకొచ్చారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గుంటూరులో పుట్టిన అంబటి  రాయుడు రాజకీయాల్లోకి రావాలని  ఆలోచిస్తున్నారు.  ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నానని  కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతానంటున్నారు.   

ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ?

 హైదరాబాద్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటికీ  తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పుడు సీఎం జగన్ ను కలిసినందున వైసీపీలో చేరుతారని భావిస్తున్నారు.

క్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచన !

వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారో లేదో అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే అంబటి రాయుడు వయుసు  37 ఏళ్లు. ఆయన ఇంకా ఎక్కువ కాలం క్రికెట్ కెరీర్ సాగించడం సాధ్యం కాదు. ఈ ఏడాది ఆయన ఐపీఎల్ ఇన్నింగ్స్ గొప్పగా సాగడం లేదు. వచ్చే సారి టీంలో ఉంచుతారో లేదో కూడాతెలియదు. అందుకే క్రికెట్ అకాడమీ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారని చెబుతున్నారు. దానికి భూమి అడిగేందుకు జగన్ ను కలిశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే సీఎం జగన్ తో భేటీపై .. అటు అంబటి రాయుడు కానీ ఇటు సీఎంవో కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటన చేసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.