అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం గుడికి చేరుకోనున్న సీఎంకు రాష్ట్ర మంత్రులు ఓంకారం వద్ద స్వాగతం పలకనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన షెడ్యూల్లో మార్పు జరిగింది. శనివారం ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో జగన్ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
సీఎం అమ్మవారిని దర్శించుకునే సమయంలో ఆలయ అధికారులు వీఐపీ క్యూలైన్లను నిలిపివేయనున్నారు . సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుపనున్నారు. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరని తెలిసింది.