తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ మౌనం

తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ మౌనం
  • సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీ కాంగ్రెస్ మహిళా నేత
  • నదీ జలాలపై సీఎం జగన్ వి అసమర్థ వ్యాఖ్యలు
  • ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకురాలు సుంకర పద్మశ్రీ
  • తెలంగాణలోని మీ ఆస్తులు కాపాడుకునేందుకే జల వివాదాలపై మాట్లాడడం లేదు
  • మీకు దమ్ములేకపోతే చెప్పండి.. మహిళలు మేం పోరాడడానికి సిద్ధం –సుంకర పద్మశ్రీ

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. నదీ జలాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అసమర్థత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆమె సీఎం జగన్ అసమర్ధ ముఖ్యమంత్రి అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడమే కాదు.. మీ ఆస్తులు కాపాడుకునేందుకే జల వివాదాలపై మాట్లాడడం లేదని.. ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ ముందు తాకట్టుపెట్టారని దుమ్మెత్తిపోశారు. జగన్ వ్యాఖ్యలు మీడియాలో చూసి తాను స్పందించాల్సి వచ్చిందంటూ వాడి వేడి పదజాలంతో ఆమె సూటిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై పెదవి విప్పరేం
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం లేదని సుంకర పద్మశ్రీ విమర్శించారు. ‘‘జగన్ సోదరి షర్మిల కూడా తెలంగాణ వైపే మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన చుక్క నీటిని కూడా విడిచిపెట్టేది లేదని అంటున్నారు. నది జలాలపై తెలంగాణ మంత్రులు కూడా అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్ ఒక దొంగ, నరరూప రాక్షసుడని టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ ఆ వ్యాఖ్యలపై నోరు మెదపడం లేదు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారు అందుకే నది జలాల విషయంలో మాట్లాడటం లేదని  సిగ్గులేకుండా చెబుతున్నారు. తెలంగాణలో ఉన్న మీ ఆస్తులను కాపాడుకోవడానికి జల వివాదాలపై మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ ముందు తాకట్టు పెట్టారు.. ’’ అంటూ సుంకర పద్మశ్రీ విమర్శలు గుప్పించారు. 
ఆంధ్రప్రదేశ్ రైతాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దమ్ము లేకపోతే చెప్పండి..  మహిళలుగా మేము ముందుకు వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుంకర పద్మశ్రీ ప్రకటించారు.