12వ బోర్డు మీటింగ్ మినిట్స్పై విచిత్రమైన వాదనలు
తెలంగాణ అభిప్రాయాలను తొలగించాలని ఇన్డైరెక్ట్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను ఏపీ ప్రభుత్వం డిక్టేట్ చేస్తోంది. బోర్డు 12వ మీటింగ్లో రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటిపై బోర్డు సూచనలతో కూడిన మినిట్స్ను కేఆర్ఎంబీ పంపగా.. అందులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనలు మినిట్స్లో ఎలా పొందుపరుస్తారంటూ నిలదీసింది. తాము చెప్పిన అంశాలనే మినిట్స్లో చేర్చాలని ఇన్డైరెక్ట్ గా ఆదేశించింది. బోర్డు మీటింగ్ లో చర్చకే రాని నాగార్జునసాగర్, పులిచింతల పవర్ షేరింగ్ ఇష్యూను ఎందుకు మినిట్స్లో చేర్చలేదంటూ కేఆర్ఎంబీని ప్రశ్నించింది. ఏపీ రిప్లయ్ని చూసి బోర్డు పెద్దలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ ఏపీనే చెబుతోంది
ఏపీ చేపట్టే రాయలసీమ లిఫ్ట్స్కీం పై తెలంగాణ చేసిన వాదనను తప్పుబడుతూ దాన్ని ఎలా రికార్డు చేయాలో ఏపీనే చెప్పింది. పాలమూరు–రంగారెడ్డి పాత స్కీమేనంటూ తెలంగాణ చేసిన వాదన, ప్రధాని మోడీ ఎన్నికల సభలో ప్రస్తావించిన అంశాలను మినిట్స్లో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నించింది. వాటిని తొలగించాలని బోర్డును డైరెక్ట్ చేసింది. డిండి, భక్తరామదాసు, మిషన్భగీరథ, తుమ్మిళ్ల లిఫ్టు స్కీములపై తెలంగాణ చేసిన వాదనను మినిట్స్లో పేర్కొనడాన్నితప్పుబట్టింది.
చర్చించని అంశాలపైనా కొర్రీలు
బోర్డు మీటింగ్ లో శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే కరెంట్ పంపకాలపైనే చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలు సమంగా పంచుకోవడానికి ఓకే చెప్పాయి. నాగార్జునసాగర్, పులిచింతల పవర్ స్టేషన్ లకు సంబంధించిన కరెంట్ పంపకాలపై ఎలాంటి చర్చ జరగలేదు. చర్చించకున్నా ఆ అంశాన్ని
ఎందుకు మినిట్స్లో చేర్చలేదని ఏపీ ప్రశ్నించింది. క్యారీ ఓవర్ వాటర్, డొమిస్టిక్ యూసేజీకి తీసుకుంటున్న నీటిలో 20 శాతమే లెక్కలోకి తీసుకోవడం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు డైవర్ట్ చేస్తున్న నీటికి బదులుగా తెలంగాణ కోరుతున్న 45 టీఎంసీల నీటి వాటాపైనా ఏపీ తనదైన
భాష్యం చెప్పింది. కృష్ణా బేసిన్కు తెలంగాణ వివిధ ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తోందని, అలాంటప్పుడు 45 టీఎంసీల్లో వాటా అంశం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చి టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకు వాటి విషయంలో ముందుకెళ్లరాదని ఆదేశించాలని కోరింది. ఏపీ వాదనలపై కేఆర్ఎంబీ సీనియర్ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బోర్డుమీటింగ్లో రెండు రాష్ట్రాలు చర్చించిన అంశాలు, వాటిపై బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ మినిట్స్ రూపొందిస్తామని చెప్పారు. కానీ ఒక రాష్ట్రం వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మినిట్స్లో పేర్కొనడం సరికాదంటూ ఏపీ తప్పుబట్టడం సరికాదన్నారు.
ప్రాజెక్టుల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఇవ్వండి: కేఆర్ఎంబీ
కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వివరాలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) రెండు రాష్ట్రాలను కోరింది. బోర్డు మెంబర్ హరికేశ్ మీనా శనివారం రెండు రాష్ట్రాల అటవీశాఖ కార్యదర్శులకు లెటర్లు రాశారు. ఆయా ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ శాఖ నుంచి ఏ స్థాయిలో క్లియరెన్స్లు ఉన్నాయి, వాటి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు.
For More News..