
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. వింత వ్యాధి ప్రబలుతుండడానికి ప్రధాన కారణాలేమిటన్నది నిగ్గు తేల్చేందుకు 21 మంది సభ్యులతో హైపవర్ కమిటీ వేసింది ప్రభుత్వం. ఈ కమిటీకి చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, కన్వీనర్ గా ఆరోగ్య శాఖ ప్రినిపల్స్ సెక్రెటరీ వ్యవహరిస్తారు. వాస్తవాలు నిగ్గు తేల్చడంతోపాటు.. నివారణ చర్యలు కూడా సూచించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.