
దివంగత టాలీవుడ్ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివని ఏపీ మంత్రి రోజా అన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యలను ఆమె పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాతపస్వి లేరన్న విషయం ఊహించుకోవడమే కష్టంగా ఉందని రోజా చెప్పారు.
విశ్వనాథ్ తన సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారని రోజా చెప్పారు. ఒక దర్శకుడిగా ఒక నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని తెలిపారు. తెలుగు నెల ఉన్నంత వరకు తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలుగు సినిమాకు విశ్వనాథ్ చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించిందని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నామని ఆమె తెలిపారు.