కేఆర్ఎంబీకి తెలంగాణ కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తమ వాటా కన్నా వంద రెట్లు ఎక్కువగా నీటిని తరలించుకుపోయేలా ఏపీ పనులు చేయిస్తోందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏపీని కట్టడి చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ సోమవారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు ఈ మేరకు లేఖ రాశారు. శ్రీశైలంలో 882 అడుగుల నుంచి ఏపీ1,500 క్యూసెక్కులు మాత్రమే తీసుకునేందుకు చెన్నై వాటర్ సప్లయ్ (ఇంటర్ స్టేట్) అంశం అగ్రిమెంట్లో ఉందని, కానీ 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని తరలించేందుకు ఆ రాష్ట్రం పనులు చేయిస్తోందని లేఖలో తెలిపారు. బేసిన్ అవసరాలు తీరకుండా మరో బేసిన్కు నీటిని తరలించడానికి బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులన్నీ వరల్డ్ బ్యాంక్ నిధులతోనే చేపట్టిందని, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ను అతిక్రమించి చేస్తున్న ఈ పనులను నియంత్రించాలని కోరారు. కృష్ణా బేసిన్ అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, ఏపీ నికర జలాలతో పాటు మిగులు జలాలను బేసిన్ అవతలికి తరలించేందుకు పనులు చేస్తుందని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్(ఆపరేషన్ ప్రొటోకాల్)కు సంబంధించిన డేటా సవరించాలని కోరుతూ తాము లేఖలు రాశామని, కేఆర్ఎంబీ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ నివేదికల్లోనూ తెలంగాణ అభిప్రాయాలను చేర్చాలని ఆ లేఖల్లో కోరామని గుర్తు చేశారు.
27న ఆర్ఎంసీ మీటింగ్
కేఆర్ఎంబీ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మీటింగ్ ఈ నెల 27న నిర్వహించనున్నట్లు సభ్యులకు బోర్డు సోమవారం లేఖ రాసింది. ఇప్పటికే ఈ సమావేశాన్ని మూడుసార్లు వాయిదా వేశారు. మంగళవారం సమావేశం నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాము హాజరుకాలేమని తెలంగాణ ఈఎన్సీ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జలసౌధలో సమావేశం నిర్వహించనున్నట్లు, సభ్యులందరూ హాజరుకావాలని బోర్డు కోరింది.