భద్రాచలం, వెలుగు : అంబసత్రంలోని హరిదాస మండపంలో బుధవారం భద్రాచలం సీతారామచంద్రస్వామికి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్ సేవ ఘనంగా జరిగింది. వేదపాఠశాల విద్యార్థులకు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామిని ఊరేగింపుగా అంబసత్రానికి తీసుకెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు,వేద పారాయణాలు తర్వాత హారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఉదయం ప్రాకార మండపంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు.
బేడా మండపంలో నిత్య కల్యాణాలను పున: ప్రారంభించారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. కల్యాణం అనంతరం మంత్రపుష్పం సమర్పించారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం అంబసత్రంలో రాపత్ సేవకు సీతారామచంద్రస్వామి బయలుదేరి వెళ్లారు. తిరువీధి సేవ అనంతరం రాపత్ సేవ జరిగింది.
