
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ పర్యటనలో సింగయ్య అనే వృద్ధ రైతు మరణం వివాదాస్పదంగా మారింది. మొదట సింగయ్య ప్రైవేట్ కారు కింద పడి చనిపోయారని నిర్దారించిన పోలీసులు.. ఆ తర్వాత సింగయ్య జగన్ కారు కిందనే పడి మరణించారని తేల్చారు. ఈ మేరకు కారు డ్రైవర్, జగన్ పై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణలో మంగళవారం ( జూన్ 24 ) జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. సత్తెనపల్లిలో జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని విచారణ కోసం తీసుకెళ్లారు నల్లపాడు పోలీసులు.
ALSO READ | ఇంకో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా జగన్ ను A2గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం తాడేపల్లి వైసీపీ ఆదీసుకు వెళ్ళిన పోలీసులు పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అనంతరం సత్తెనపల్లిలో జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ కారు AP 40 DH 2349 విచారణ నిమిత్తం తీసుకెళ్లారు నల్లపాడు పోలీసులు.పోలీసులు జగన్ కారును తీసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కామెంట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.
సింగయ్య ప్రైవేట్ కారు కింద పడి మరణించారని మొదట వెల్లడించిన పోలీసులు.. మూడు రోజుల తర్వాత జగన్ కారు కింద పడి మరణించారని నిర్దారించటంపై వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అరెస్ట్ చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ కుట్ర పన్నుతోందని అంటున్నారు. సింగయ్య జగన్ కారు కింద పడ్డట్టు ప్రచారం చేస్తున్న వీడియో కూడా ఫేక్ వీడియో అని ఆరోపిస్తున్నారు. మరి, ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఈ కేసు ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.