ఇంకో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఇంకో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రాదు, రాబోదని.. 2029లో రాబోయేది కూటమి ప్రభుత్వమే అని అన్నారు. ఇంకో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నది వికసిత భారత్ కోసమేనని అన్నారు పవన్ కళ్యాణ్. రోడ్ల మీదకు వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతులు కోస్తామంటూ సినిమా డైలాగులు చెప్తే మక్కెలు విరగ్గొట్టి కూర్చుబెడతామని అన్నారు.. తాము సరదాగా లేమని, చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చామన్నారు పవన్ కళ్యాణ్.

ALSO READ | ఏపీ ఏడాది కూటమి పాలన అంతంతే ! జగన్ మారాలి.. పవన్ మారొద్దు.. బాబు ఓకే అయినా.. నచ్చని విపరీతాలు!

జగన్ నియంతృత్వ ధోరణి ఇంకా మారలేదని.. ప్రజాస్వామ్య విధానాలపై వైసీపీకి నమ్మకం లేదని అన్నారు పవన్ కళ్యాణ్. విదేశాల్లో ఉన్నా వెంటాడతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని అస్సలు సహించబోదని.. గొంతులు కోస్తామంటూ హెచ్చరిస్తే భయపడమని అన్నారు పవన్. ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామని పిచ్చి బెదిరింపులు చేయొద్దని అన్నారు పవన్.

ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నామని.. గత ఐదేళ్లు విధ్వంసకర పాలన జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబును గత పాలకులు ఎంతగానో ఇబ్బంది పెట్టారని.. అధికారులు కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు పవన్. విశాఖలో తనను కూడా అడ్డుకున్నారని.. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ సాధారణ రోజులు వస్తాయా అని అనిపించేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్పట్లో విలవిలలాడిపోయారని.. అందుకే సుపరిపాలన కోసం తాము కూటమిగా ఏర్పడ్డామని అన్నారు పవన్ కళ్యాణ్.