ఏపీ ఏడాది కూటమి పాలన అంతంతే ! జగన్ మారాలి.. పవన్ మారొద్దు.. బాబు ఓకే అయినా.. నచ్చని విపరీతాలు!

ఏపీ ఏడాది కూటమి పాలన అంతంతే ! జగన్ మారాలి.. పవన్ మారొద్దు.. బాబు ఓకే అయినా.. నచ్చని విపరీతాలు!

అద్దం అబద్ధం చెప్పదనేది నానుడి. దాన్ని నిజం చేసేలా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిన ఓ సర్వే, ఆంధ్రప్రదేశ్​లో కూటమి ఏడాది పాలన గొప్పగా ఏం లేదని స్పష్టం చేస్తోంది. ఎన్డీయే కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు దురదృష్టంలోనూ అదృష్టమేమంటే మెజారిటీ రాష్ట్ర ప్రజల వేచిచూసే ధోరణి!  సమస్యలతో నలుగుతూనే పరిష్కారాల కోసం వారు నిరీక్షిస్తున్నారు. ‘ప్రత్యర్థులపై ప్రతీకారం, కక్ష సాధించమని కాదు, కూటమిని ఎన్నుకున్నది..సంక్షేమం-, అభివృద్ది కావాలి’ అనేది స్థూల జనాభిప్రాయం. కేంద్రం సహకరిస్తున్నా ఆర్థికం అంతంతే! 

కుల సమీకరణాలు పునరేకీకరణ దిశలో ఉన్నాయి. పెద్దన్న టీడీపీ ఒంటెద్దుపోకడ కూటమి ఐక్యతకే సవాల్​గా మారింది! జనసేన నాయకత్వం సాగిలబాటు పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోంది. ఏపీలో ఎదిగే ఉద్దేశం బీజేపీకి ఉన్నట్టే లేదు. వైఎస్సార్సీపీ నాయకుడిలో మార్పు చూడని జనం అటు వైపు ఆశలేం పెంచుకోవట్లేదు. స్థూలంగా ఇదీ ఏపీలో ఏడాది పాలన తర్వాతి రాజకీయ, ఆర్థిక, సామాజిక ముఖచిత్రం.

ఆంధ్రప్రదేశ్ లో  ‘మంచి ప్రభుత్వం’ ఉందని ప్రజలేం భావించడం లేదు. అలా అని ప్రభుత్వంపై వ్యతిరేకత వేగంగా బలపడుతున్న జాడలు కూడా లేవు. ‘ఒకటి, రెండు హామీలు నెరవేర్చారు కదా, చూద్దాం ఒకటొకటిగా మిగతావీ చేస్తారేమో?’ అనే వేచిచూసే ధోరణే అత్యధికుల్లో  కనిపిస్తోందని ‘పీపుల్స్ పల్స్’ సర్వే తేటతెల్లం చేస్తోంది. జనం దృష్టిలో అధికారుల పని అస్సలు బాగున్నట్టు లేదు. అదే సమయంలో పాలకుల ‘రెడ్ బుక్’ సంస్కృతినీ వారు ఈసడించుకుంటున్నారు. 

జాతీయ పార్టీలు ఎదగలేకపోతున్నాయి!
జాతీయ పార్టీలు ఎదగకపోగా మరింత బలహీనపడుతున్నాయి. ప్రాంతీయ శక్తులే రాజకీయంగా బలపడి ఉన్నాయి. కూటమి పక్షాల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విపక్షమైన వైఎస్సార్సీపీ ఉన్నపళంగా ప్రత్యామ్నాయమనే భరోసా ప్రజలకేం కల్పించడం లేదు. నాయకుడి ప్రవర్తన, పార్టీ శ్రేణుల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. నిజమైన ప్రజా సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టని ఏపీ మీడియా, రాజకీయ పార్టీల అనుకూల,ప్రతికూల వైఖరులతో నిలువునా చీలిపోయి ఉంది.

చెప్పినవి చేసినా చాలు!
పెన్షన్లు పెంచి, సక్రమంగా ఇవ్వటం తప్ప నగదుతో ముడిపడి ఉన్న ఏ ఇతర ఎన్నికల హామీల అమలూ మొదలు కాకపోవడం పట్ల జనం అసంతృప్తితో ఉన్నారు. ‘సర్వే కాలం’ తర్వాత ఇవ్వడం ప్రారంభించిన ‘తల్లికి వందనం’ (అమ్మఒడికి బదులు) కొంత సానుకూలతను పెంచినట్టు క్షేత్రం నుంచి రిపోర్టులు వస్తున్నాయి.   ఎన్నికలప్పుడు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, 18 –-69 మధ్య వయస్కులకు నెలనెలా రూ.1500, ఉచిత బస్సు సౌకర్యం వంటివి అందుబాటులోకి రాకపోవడాన్ని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. శాంతి -భద్రతల మెరుగు, రోడ్ల రిపేర్లు, ఇసుక విధానం వంటి అంశాల్లో మార్పు వచ్చినట్టు స్థానికులు అంగీకరిస్తున్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు వేగం పుంజుకున్నాయనేది వారికి సంతృప్తినిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కుటుంబ పెత్తనాలు పెరిగాయనే ఘాటైన విమర్శ ఉంది.   

ఎవరికి వారు ‘ఎకో చాంబర్లో’నే!
ఎలా గెలిచామని పాలక కూటమి, ఎందుకు ఓడామని విపక్ష పార్టీ సమీక్షించుకున్నదే లేదు. రాజకీయ పంథాలో ఎవరి దారిలో వారు సాగుతున్నారు. ‘అంతా బావుంది, కోరి పట్టంగట్టిన ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందిస్తున్నాం, మాది మంచి ప్రభుత్వం, విపక్షం ఇక కోలుకోలేదు, కోలుకోనివ్వం’ అన్న ధీమాతో పాలక కూటమి ఉంది. ‘కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది, పొరపాటున గెలిపించామని ప్రజలు గ్రహిస్తున్నారు, కళ్లు మూసి తెరుచుకుంటే నాలుగేళ్ల కాలం గిర్రున తిరిగి మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, వచ్చి తీరుతాం’ అని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపోస్తోంది. వాస్తవాలు గ్రహించకుండా, గమనంలోకి వచ్చినా అంగీకరించకుండా ఇద్దరూ, ఎవరికి వారు ‘ఎకో చాంబర్’లో ఉండి కాలం నెట్టేస్తున్నారు. కాకపోతే, 2029 నాటికి, 2024 నాటి ఏకపక్ష రాజకీయ వాతావరణం ఉండదనే సంకేతాలు ప్రజాక్షేత్రం నుంచి వెలువడుతున్నాయి.

వెలుగు- నీడల సయ్యాట
కేంద్ర సహకారంతో పనులు వేగం పుంజుకుంటున్నా, అమరావతిపై మిశ్రమ స్పందన ఉంది. భూములిచ్చిన పాత రైతుల్లోనూ సందేహాలు కలుగుతున్నాయి. ఇక్కడ  రైతులకు కౌలు, పేదలకు పెన్షన్ మరో పదేళ్లు పొడిగించాల్సి వచ్చేలా ఉంది.  పోలవరం పనులు మళ్లీ మొదలైనా నిర్వాసితుల సమస్య జటిలంగానే ఉంది. రాష్ట్రంలో శాంతి -భద్రతల సమస్య వైకాపా ఆరోపించినంత దారుణంగా లేకపోయినా పల్నాడు, కొన్ని సీమ ప్రాంతాల్లో ప్రతీకార దాడులు, కక్ష సాధింపులు దారుణంగానే ఉన్నాయి.

‘గత ప్రభుత్వం విఫలమైందనే ఎన్నికల్లో మేం ప్రతీకారం తీర్చుకొని ఓడించాం, ఇంకా ‘రెడ్ బుక్’ ఏంటి? మీ కక్షసాధింపులేమిటి?’ అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.  కూటమి ప్రభుత్వ విధానాలు, చర్యలు ప్రాంతీయ వివక్షనే కాకుండా కులాల కుంపట్లనూ రగిలిస్తున్నాయి. బలమైన ప్రభావక శక్తిగా ఉన్న రెడ్డిలు  చాపకింద నీరులా మళ్లీ జగన్ వైపుకు కదులుతున్నారు. వారికి తోడు మాల, మైనారిటీలు, మరికొన్ని కులాల్లో మెజారిటీ జగన్​వైపు మొగ్గు కనిపిస్తున్నది.  కమ్మ, కాపు, క్షత్రియ, వైశ్య, బీసీ, మాదిగ వర్గాల్లో మెజారిటీ కూటమి వైపు ఏకీకృతమౌతున్నట్టు కనిపిస్తోంది. ఇవన్నీ సామాజికంగా  కొత్త పునరేకీకరణలకు దారితీసే వాతావరణం కనిపిస్తోంది.

జగన్ మారాలి
151 స్థానాల నుంచి 11కు పడిపోయి, సీట్ల పరంగా ఘోర ఓటమిని చవిచూసినా... దాదాపు 40 శాతం ఓటు వాటాతో ఏపీలో వైసీపీ బలమైన రాజకీయ శక్తిగానే ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వై.ఎస్.జగన్ కొంతమేర తన పనితీరును, వ్యవహారశైలిని మార్చుకొని జనంతో వారి సమస్యలతో మమేకం కావాలనే భావన సామాన్యుల్లో ఉంది. అది జరగనంతవరకు ఆ పార్టీ రాజకీయ పరిస్థితి మారదని వారంటారు. ‘తప్పదు, వచ్చే ఎన్నికల్లో జనమే మమ్మల్ని గెలిపించుకుంటారు, వారికింకొక మార్గం లేద’నే ధోరణి సరికాదని జనాభిప్రాయం. పార్టీ ఓటమికి కారణమైన అంశాల్లో ఒకటైన జగన్ ‘కోటరీ’ ఇప్పటికీ క్రియాశీలకంగా పనిచేస్తూ,  జగన్​కి -పార్టీ శ్రేణులకి, ప్రజలకి మధ్య ఇంకా అడ్డుగోడగానే ఉంది. దాన్ని ఆయన అధిగమించాలి.

పవన్ మారొద్దు
కూటమిలో ప్రధానపక్షంగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన టీడీపీ, ప్రభుత్వం ఏర్పాటయిన నుంచి ఒంటెద్దుపోకడతోనే ఉంది. కేంద్ర సర్కారు నడపడంలో టీడీపీ పై ఆధారపడాల్సిన స్థితివల్లనేమో, బీజేపీ అగ్రనాయకత్వం కొంత మెతకగా ఉండటాన్ని బాబు సానుకూలంగా మలచుకుంటున్నారు. ఏపీ బీజేపీని ఆయన లెక్కచేయరనేది జనాభిప్రాయం. జనసేనదీ దాదాపు అదే పరిస్థితి. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ పెత్తనమే సాగటాన్ని జనం గమనిస్తున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కల్యాణ్ కు సాన్నిహిత్యం కరువవడం, పార్టీ యంత్రాంగంపై ఆజమాయిషీ లేకపోవడంతో పార్టీ పరిస్థితి ‘పైన పటారం, లోన లటారం’ అన్నట్టుంది.  అంతా టీడీపీకి ధారాదత్తం చేసినట్టు కాకుండా కూటమి ధర్మం పాటిస్తూ -జనాభిమానం మేరకు జనసేన ఉనికిని కాపాడుకోవాలని జనమంటున్నారు. ఎన్నికలకు ముందున్నట్టే.. సూటిగా, నిక్కచ్చిగా, నిటారుగా ఉండాలని, సాగిలపడకూడదని సగటు అభిమానులు కోరుకుంటున్నారు. అటు అధికార కూటమి, ఇటు విపక్షం..ఏడాదిలో సాధించిందేమీ లేదు, కాలం వెళ్లదీయడం తప్ప!

బాబు ఓకే అయినా.. నచ్చని విపరీతాలు!
విస్పష్టంగా కారణాలు చెప్పకపోయినా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఓకే.  కానీ, ఇతరులెవరూ గొప్పగా పనిచేయట్లేదనే భావన ప్రజల్లో ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్​ను అంగీకరిస్తున్న సాధారణ జనం, ముఖ్యమంత్రి తనయుడు, మరో మంత్రి లోకేశ్​ను ఉప ముఖ్యమంత్రిగానో, ఏకంగా తదుపరి సీఎంగానో అంగీకరించే వాతావరణమైతే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీత ప్రయోగాలకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన 2047 వాదన ఎవరికీ అర్థం కావట్లేదు. ఆచరణలో లేకుండా ‘నేను 1996 -–99 చంద్రబాబును’ అని ఎంత చెప్పుకున్నా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

దిలీప్​రెడ్డి పొలిటికల్​ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్​ రీసెర్చ్​ సంస్థ