శ్రీశైలం నీళ్లపై ఏపీ, తెలంగాణ వాదన

శ్రీశైలం నీళ్లపై ఏపీ, తెలంగాణ వాదన

తోడేసింది మీరంటే, మీరేనని నిందించుకున్న రెండు రాష్ట్రాలు
హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీళ్లన్నీ కరెంట్‌ ఉత్పత్తితో తోడేసింది మీరు అంటే మీరు అని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పరస్పరం వాదించుకున్నాయి. కేఆర్‌‌ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రీమెన్‌ కమిటీ సమావేశాన్ని గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా కరెంట్ ఉత్పత్తి చేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయిందని రాయ్‌పురే అన్నారు. నీళ్లు తోడేసింది ఏపీయేనని తెలంగాణ ఆరోపణలు చేయగా.. తెలంగాణ తోడేసిందని ఏపీ ఆరోపించింది. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు 2.4 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కేఆర్‌‌ఎంబీని తెలంగాణ కోరింది. సాగర్‌‌ నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేసుకుంటామని, ఆ నీటిని ఏపీ తరలించకుండా కట్టడి చేయాలని కోరింది. కాగా, శ్రీశైలం నుంచి ప్రస్తుతం తమకు నీళ్లు అవసరం లేదని, సాగర్‌‌ నుంచి 30 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ కోరింది. సాగర్‌‌ నుంచి ఇప్పటికే కోటాకు మించి నీటిని ఏపీ వాడుకుందని తెలంగాణ అభ్యంతరం చెప్పింది. రాష్ట్ర వాటాగా రావాలసిన 65 టీఎంసీలను రిలీజ్ చేయాలని తెలంగాణ కోరింది. దీనిపై తర్వాత జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ తరఫున కర్నూల్‌ సీఈ మురళీనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.