బేసిన్​ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు

బేసిన్​ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు
  • నీటి వాడకంపై జాతీయ విధానం ఉండాలె..: జగన్
  • రాయలసీమకు నీళ్ల విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి

చాలా రాష్ట్రాల్లో బేసిన్​ అవతలికి నీటిని తరలిస్తున్నారు. నీటి వినియోగంపై జాతీయ స్థాయిలో విధానం రూపొందించాలి. దేశంలో థార్‌ ఎడారి తర్వాత అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమకు నీటిని తరలించడాన్ని మానవతా దృక్పథంతో చూడాలి. కృష్ణా నీళ్లలో 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలు తెలంగాణ వాడుకొనేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకే నీళ్లు తీసుకునేందుకే పాలమూరు, డిండి స్కీంలు చేపడతామని తెలంగాణ చెప్పింది. అలాగే వాటా తీసుకునేందుకు సంగమేశ్వరం కడ్తున్నం.

– జగన్, ఏపీ సీఎం

హైదరాబాద్‌‌, వెలుగునీటి వినియోగంపై జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాలని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్​లో ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. దేశంలో థార్‌‌ ఎడారి తర్వాత అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమకు నీటిని తరలించడాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒక బేసిన్‌‌ నుంచి మరో బేసిన్‌‌కు నీటిని మళ్లిస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, కృష్ణా, మూలమట్ట, ఇంద్రాయణి, పెరియార్, చెలకుడి నదుల నుంచి ఇతర బేసిన్లకు నీళ్లు తీసుకెళ్తున్నారని వివరించారు. కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు డీపీఏపీలో ఉన్నాయంటే ఆ ప్రాంతాలు ఎంత వెనుకబడి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాయలసీమ జిల్లాల మాదిరిగా తెలంగాణలోని మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కూడా కరువు ప్రభావ ప్రాంతాలే అయినా.. ఈ జిల్లాల్లో 30 శాతం భూమికి సాగునీరు అందుతోందని చెప్పారు. రాయలసీమ అయితే నిత్యం కరువుతో అల్లాడుతోందని, ఒక్కో జిల్లాకు కనీసం 50 టీఎంసీల నీళ్లు కూడా అందుబాటులో లేవని ఆయన
తెలిపారు.

299 టీఎంసీలకు తెలంగాణ ఒప్పుకొంది

కృష్ణా నీళ్లలో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకునేలా ఒప్పందం కుదిరిందని జగన్​ గుర్తు చేశారు. ఏపీకి కేటాయించిన వాటా మేరకు నీటిని తీసుకోవడానికే శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ లిఫ్ట్‌‌ స్కీం చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లేదని.. తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌‌ ఆయకట్టును స్టెబిలైజ్‌‌ చేయడానికే చేపడుతున్నామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్​ స్కీంల ద్వారా తమకు కేటాయించిన నీటిని మాత్రమే తీసుకుంటామని 2016లో జరిగిన మొదటి అపెక్స్‌‌ మీటింగ్​లో తెలంగాణ చెప్పిందని.. ఇప్పుడు తాము కూడా అదే రీతిలో రాయలసీమ లిఫ్ట్‌‌ స్కీం చేపడుతున్నామని వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్‌‌కు 2009లో రికార్డు స్థాయిలో 26 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో డ్యాం దెబ్బతిన్నదని జగన్​ తెలిపారు. దాని రిపేర్లకు రూ.900 కోట్లు ఖర్చవుతాయని డ్యామ్‌‌ సేఫ్టీ కమిటీ తేల్చిందని.. ఆర్థిక ఇబ్బందుల్లో తమ రాష్ట్రానికి ఇది భారం కాబట్టి కేంద్రం, తెలంగాణ వాటాలు ఇచ్చి సహకరించాలని కోరారు.