యాపిల్ స్టాండ్ రూ.70 వేలు..అవాక్కవుతున్నజనాలు

యాపిల్ స్టాండ్ రూ.70 వేలు..అవాక్కవుతున్నజనాలు

యాాపిల్.. ఆ పేరుకున్న ఫాలోయింగ్​, క్రేజ్​ వేరు. ఓ ప్రొడక్ట్ ను మార్కెట్​లోకి రిలీజ్ చేస్తున్నట్లు యాపిల్ ప్రకటిస్తే చాలు. ఇక దాని గురించి చర్చలే చర్చలు. ఫీచర్స్, కలర్, సైజ్.. గురించి స్టోరీలు. ​తాజాగా ఓ ప్రొడక్ట్ ను రిలీజ్ చేసింది యాపిల్. అయితే ఈసారి సదరు ప్రొడక్ట్ కంటే.. దాని ధర గురించే చర్చ నడుస్తోంది. విమర్శలు, జోకులు పేలుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఐఫోన్ ఎక్స్ఎస్ కొనొచ్చు 

ఈ మధ్య జరిగిన డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో కొన్ని కొత్త ప్రొడక్ట్స్​ను యాపిల్ ఆవిష్కరించింది. ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాక్ ప్రో’ కంప్యూటర్ ను రిలీజ్ చేసింది. దానితోపాటు మానిటర్​ను విడుదల చేసింది. మాక్ ప్రో ధర 6 వేల డాలర్లు (సుమారుగా రూ.4.17లక్షలు), మానిటర్ ధర 5 వేల డాలర్లు (రూ.3.47 లక్షలు). మొత్తం 11 వేల డాలర్లు. ఇక్కడి వరకు బాగానే ఉంది కథ. తర్వాత మానిటర్ ‘స్టాండ్’ ధర ప్రకటించారు. అంతా షాక్ తిన్నారు. ఎందుకంటారా? ఆ స్టాండ్ రేటు అలా ఉంది మరి!! ఏకంగా వెయ్యి డాలర్లంట. మన రూపాయల్లో చెప్పాలంటే 70 వేలు. ‘ఎక్కడైనా ఒకస్టాండ్​కు ఇంత రేటు ఉంటుందా?’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. అదే వెయ్యి డాలర్లు ఉంటే ఐఫోన్ ఎక్స్ఎస్ కొనొచ్చని, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్ ఇంకా వంద డాలర్లు తక్కువని అంటున్నారు.

జోకులు, విమర్శలు

యాపిల్ మానిటర్ స్టాండ్ పై సోషల్ మీడియాలో విమర్శలు, జోకులు పేలుతున్నాయి. ‘‘ఒక్క యాపిల్ మాత్రమే ఇలా చేయగలదు. ఓ స్టాండ్ ధర వెయ్యి డాలర్లు అని చెప్పి.. అదేదో కళాఖండం మాదిరి చూపుతుంది” అని మైక్ మర్ఫీ అనే జర్నలిస్టు ఎద్దేవా చేశాడు. ‘‘ఐఫోన్ ఎక్స్ఎస్ కొనాలో, మానిటర్ స్టాండ్ కొనాలో తేల్చుకోలేకపోతున్నా” అని బ్లూమ్​బర్గ్​కు చెందిన మార్క్ గుర్మన్ అన్నారు.