హైదరాబాద్, వెలుగు: శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై తిప్పిపంపారు. ఆ బిల్లులను మరోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. వైద్య ప్రొఫెసర్ల పదవీకాలం పొడిగింపు బిల్లు, మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు బిల్లు, ప్రైవేటు వర్సిటీల బిల్లు, భద్రాచలంలో మరో రెండు జీపీల ఏర్పాటు బిల్లులను మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన శాసనమండలి ఆ బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతకుముందు జరిగిన క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానంచెప్పారు.
కులవృత్తులపై హేళన చేస్తున్రు..
కుల వృత్తులను ప్రోత్సహించి పేద వర్గాలకు అండగా నిలుస్తుంటే కొన్ని పార్టీలు హేళనగా మాట్లాడుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కౌన్సిల్లో మండలి సభ్యులు శేరి సుభాష్రెడ్డి, తాతా మధు.. చేపల పెంపకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. 18 ఏండ్లున్న ప్రతి మత్స్యకారుడికి మెంబర్ షిప్ ఇస్తున్నామన్నారు. 26 వేల చెరువులను జియోట్యాగింగ్ చేశామన్నారు. ఐదేండ్లలో చేపల ఉత్పత్తి 2.94 లక్షల టన్నుల నుంచి 4.38 లక్షల టన్నులకు పెరిగిందన్నారు.
బీఆర్ఎస్తోనే ఎంబీసీలకు గుర్తింపు..
అత్యంత వెనుకబడిన వర్గాలను గత పాలకులు విస్మరించారని, బీఆర్ఎస్ సర్కారు వారిని గుర్తించి అర్హులైన ఎంబీసీలకు ఆర్థిక సాయం అందిస్తోందని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కౌన్సిల్లో సారయ్య, ఎల్ రమణ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.
స్పౌజ్ బదిలీలు చేపడతాం..
యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఖాళీలను బట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.317 జీవో కారణంగా స్పౌజ్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, వారు ఒకే చోట పని చేసేలా చూడాలని బీజేపీ సభ్యుడు ఏవీఎన్ రెడ్డి కోరారు.
3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
రాష్ట్ర అసెంబ్లీ మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ద తెలంగాణ ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్సైన్సెస్ బిల్ (టిమ్స్), ద ఫ్యాక్టరీస్(తెలంగాణ అమెండ్మెంట్బిల్), తెలంగాణ స్టేట్మైనార్టీస్ కమిషన్ అమెండ్మెంట్ బిల్లులను శనివారం సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు.
ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ తొమ్మిదేండ్ల అభివృద్ధిపై షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు తెలంగాణ సాధించిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమాధానమివ్వనున్నారు. రాష్ట్ర రెండో అసెంబ్లీకి చివరి సెషన్ కావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్, మంత్రులు గ్రూప్ ఫొటోలు దిగనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్అనుమతిస్తే సోమవారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. లేని పక్షంలో ఆదివారంతో సమావేశాలు ముగియనున్నాయి.