- నిరుటి కంటే రూ. 280 కోట్లు అధికం
- బీర్ల అమ్మకాలు రెట్టింపు
- సర్కారుకు పెరిగిన ఇన్ కం
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ సేల్స్ తో ఆర్థిక సంవత్సరం మొదట్లోనే రాష్ట్ర సర్కారుకు మస్త్ ఆమ్దానీ వచ్చింది. ఏప్రిల్ నెలలో మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకూ రూ. 2,550 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ సారి రూ. 280 కోట్లు అదనంగా లిక్కర్ సేల్ అయ్యింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 570 కోట్లు, నల్లగొండలో 260 కోట్లు, వరంగల్ అర్బన్లో 250 కోట్లు, హైదరాబాద్ జిల్లాలో 230 కోట్ల లిక్కర్ తాగారు. నిరుడు ఏప్రిల్లో రూ. 2,270 కోట్ల అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో 2,620 వైన్స్, 1000కి పైగా బార్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 20 డిపోల నుంచి వీటికి మద్యం సరఫరా అవుతోంది.
బీర్ల సేల్స్ డబుల్..
రాష్ట్రంలో బీరు అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. రెండేండ్ల కిందటి వరకు ఐఎంఎల్ సేల్స్ కంటే బీర్ల అమ్మకాలు డబుల్ ఉండేవి. రాను రాను ఐఎంఎల్ కంటే బీర్ల సేల్స్ తగ్గిపోయాయి. మరోవైపు ఎక్సైజ్ శాఖ బీర్ ధరలను పెంచింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. చల్లటి కూల్ డ్రింక్స్, బీర్లతో కరోనా ముప్పు పెరుగుతుందన్న వదంతులతో మందుబాబులు బీర్ తాగడం తగ్గించేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, బీరుపై రూ. 10 వరకు ధర కూడా తగ్గడంతో మళ్లీ బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్ లో ఎండలు దంచికొట్టడం వల్ల కూడా బీర్ల సేల్స్ డబుల్ అయ్యాయి. నిరుడు ఏప్రిల్ లో 3.14 కోట్ల బీర్లు అమ్ముడుపోగా, ఈసారి 5.8 కోట్ల బీర్లు సేల్ అయ్యాయి.
