మిస్టరీ: ఆమె టూంబ్​ కనపడిందా? 

 మిస్టరీ: ఆమె టూంబ్​ కనపడిందా? 

క్లియోపాత్రాకి సంబంధించి ఇప్పటికీ ఎన్నో విషయాలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. వాటి సంగతి ఎలా ఉన్నా ఆమె సమాధి గురించి ఆర్కియాలజిస్ట్​లు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే ఈజిప్టియన్ల దేవతగా ఆరాధించే ఓసిరిస్​ టెంపుల్​ దగ్గర ఒక టన్నెల్​ బయటపడింది. దాన్ని పట్టుకుని వెళ్తే ఆమె సమాధి దొరికినట్టే అన్నారు. మరి ఆ సమాధి దొరికిందా? ఇంకా మిస్టరీగానే ఉందా?

ప్రాచీన ఈజిప్టుని ఏకచ్ఛత్రాధిపత్యంగా 20 ఏండ్లు ఏలిన రాణి సమాధి గురించి చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్​లు తెగ వెతుకుతున్నారు. ఆమె సమాధి దొరికితే ఆమెకి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుస్తాయని ప్రపంచమే ఎదురుచూస్తోందంటే అతిశయోక్తి కాదు.

ఇదో అద్భుతం

క్లియోపాత్రా తన తండ్రి, ఈజిప్టు రాజు అయిన 12వ టాలెమీ నుంచి అధికారాన్ని చేపట్టింది. ఆ తరువాత51 బి.సి. నుంచి 30 బి.సి. వరకు ఈజిప్టు​లోని టోలెమిక్ రాజ్యానికి రాణిగా ఉంది. ఈజిప్టుకు చిట్టచివరి ఫారో ఈమె. ఈ రాణి సమాధి గురించి తెలుసుకోవాలని అన్వేషిస్తున్న పరిశోధకులకుఈజిప్టులో ఒక టెంపుల్​ దగ్గర భూఅంతర్భాగంలో ఒక​ టన్నెల్​ కనిపించింది. ఈజిప్టియన్లు దైవంగా పూజించే ఓసిరిస్​ దేవాలయంలో ఈ టన్నెల్​ బయటపడింది.

ఈ ప్రాంతాన్ని టపోసిరిస్​ మ్యాగ్నా అని పిలుస్తారు. ఇది ప్రాచీన అలెగ్జాండ్రియా పట్టణానికి పశ్చిమాన ఉంది. ఇక్కడ బయటపడిన టన్నెల్​ 6.5 అడుగుల ఎత్తు, 4,300 అడుగుల పొడవుతో ఉంది. అంటే దాదాపుగా 43 అడుగుల లోతున ఉన్న దీన్ని ‘జియోమెట్రిక్​ మిరకిల్’ అని ఈజిప్టియన్​  టూరిజం, యాంటిక్విటీస్​ మినిస్ట్రీ ఒక ప్రకటనలో చెప్పింది.

ఒకవేళ కనుక్కుంటే...

ఈ టన్నెల్​ ద్వారా ఈజిప్టును పాలించిన సామ్రాజ్ఞి సమాధి కనుక్కోవచ్చనే ఆశ చరిత్రకారుల్లో తలెత్తింది. సాన్​ డొమింగో యూనివర్సిటీ ఆర్కియాలజిస్ట్​ క్యాత్లీన్​ మార్టినెజ్​ మాట్లాడుతూ ‘‘క్లియోపాత్రా సమాధి ఇక్కడ దొరుకుతుంది అనిపిస్తోంది. ఆర్కియాలజిస్ట్​ల అన్వేషణలో టెంపుల్​ గోడల లోపల నుంచి ఉన్న టన్నెల్స్​, భూగర్భంలో ఉన్న దారులు కనుక్కోవడం ఇదే మొదటిసారి. ఈ టన్నెల్​ ద్వారా క్లియోపాత్ర సమాధిని కనుక్కోగలిగాం అంటే ఇది 21వ శతాబ్దంలో చాలా ముఖ్యమైన డిస్కవరీ అవుతుంది. టపోసిరిస్​ మ్యాగ్నా టెంపుల్​లో15 ఏండ్లకు పైగా సమాధి గురించి వెతికే పనిలో ఉన్నా. ఈ మధ్యే ఈ టన్నెల్​ బయటపడింది.

దీనికంటే ముందు మా టీంకు తవ్వకాల్లో కొన్ని నాణాలు దొరికాయి. వాటి మీద క్లియోపాత్ర, అలెగ్జాండర్​ బొమ్మలు, పేర్లు ఉన్నాయి. ఐసిస్​ దేవత బొమ్మలు, బంగారు నాలుక ఉన్న మమ్మీ, గ్రీకో–రోమన్​–స్టయిల్​ మమ్మీలు ఉన్న సమాధులు దొరికాయి. వీటితో పాటు అక్కడ సిరామిక్​ వెజల్స్​, కుండలు,​ విగ్రహాలు కూడా కనిపించాయి” అని  చెప్పింది. ఆర్కియాలజిస్ట్​గా మారిన మార్టినెజ్​ క్రిమినల్ లాయర్​. ఆ తరువాత ఆర్కియాలజిస్ట్​ అయింది.

ఈ టెంపుల్​ ప్రాంతంలో తవ్వకాలు చేసేందుకు పిటిషన్​ వేసి మరీ అనుమతులు తెచ్చుకుంది. క్లియోపాత్ర సమాధి అయితే దొరకలేదు కానీ టన్నెల్​తో పాటు మరెన్నో ముఖ్యమైన విషయాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.  భూగర్భజలాల్లో ఈ ప్రాచీన టన్నెల్​ కలిసిపోవడానికి ప్రధాన కారణం భూకంపాల వల్లనే అని రీసెర్చర్లు చెప్తున్నారు. భూ కంపాల వల్లే టెంపుల్​ కూలిపోయి ఇలా భూగర్భంలో కలిసిపోయి ఉంటుంది అనేది చాలామంది ఆర్కియాలజిస్ట్​ల అభిప్రాయం.

దోపిడీ అయ్యాయా?

క్లియోపాత్రా, ఆమె ప్రేమికుడు మార్క్​ ఆంటోని 30 బి.సి.లో మరణించాక ఆ ఇద్దరినీ కలిపి ఒకే దగ్గర సమాధి చేశారని ప్రాచీన చరిత్రకారులు చెప్పారు. రచయిత ప్లుటార్చ్​ (ఎ.డి. 45–120) ఆ సమాధి ప్రాచీన ఈజిప్టు దేవత ఐసిస్​ టెంపుల్​ దగ్గర ఉందని రాశాడు. అంతేకాకుండా అది చాలా అందమైన మాన్యుమెంట్​. అందులో బంగారు, వెండి, పచ్చలు, ముత్యాలు, ఏనుగు దంతాలతో నిండి నిధినిక్షేపాలు ఉన్నాయని చెప్పాడు.  

ఎవరెన్ని చెప్పినప్పటికీ ఈ సమాధి మాత్రం ఇప్పటికీ ఎక్కడ ఉందో తేలలేదు. ఈ సమాధి గురించి చరిత్రకారులు, పరిశోధకులు వెతుకుతూనే ఉన్నారు. అంతెందుకు ఆ మధ్య టూరిస్ట్​లకు కూడా ఈ సమాధిని వెతికే పని అప్పచెప్పింది ఆ దేశం. 2010లో ఈజిప్ట్​​ మాజీ యాంటిక్విటీస్​ మినిస్టర్​ జహి హవాస్​... ఇప్పుడు టపోసిరిస్​ మ్యాగ్నా అని పిలుస్తున్న ఒకప్పటి అలెగ్జాండ్రియా సమీపంలో తవ్వకాలు చేయించాడు. ‘‘అందులో క్లియోపాత్ర ఈజిప్టును పాలించినప్పటి తేదీలతో ఉన్న సమాధులు ఎన్నో బయటపడ్డాయి.

ఆర్కియాలజికల్​ డిస్కవరీస్​ ఎన్నో జరిగాయి. కానీ వాటిలో క్లియోపాత్రా సమాధి మాత్రం లేదు” అని హవాస్​ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో చెప్పాడు. ఒకవేళ క్లియోపాత్రా సమాధి అక్కడ దొరికినా కూడా అందులోని విలువైన వస్తువులన్నీ దోపిడీ అయిపోయి ఉంటాయి. అంతెందుకు గుర్తు పట్టేందుకు వీల్లేని పరిస్థితిలో ఉండి ఉంటుంది అని కొందరు పరిశోధకులు పెదవి విరుస్తున్నారు.