- స్వగ్రామం తుమ్మన్పేటలో దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ
అచ్చంపేట, వెలుగు: పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ స్టూడెంట్లకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు సినీ నటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని 45 గవర్నమెంట్ స్కూళ్లలో 9, 10 తరగతిలో ఫస్ట్, సెకండ్ వచ్చిన 181 మంది స్టూడెంట్లకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.
విజయ్ దేవరకొండ స్వగ్రామమైన తుమ్మన్ పేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీమణి, సినీ నటి రష్మిక మందన, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసి అభినందించారు. ఫస్ట్ వచ్చిన వారికి రూ.10 వేలు, సెకండ్ వచ్చిన స్టూడెంట్లకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. విద్యతోనే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని గుర్తించాలన్నారు. డీఈవో రమేశ్ కుమార్, విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.
