
దేశంలో గాడిద జాతి అంతరించి పోతుందా? ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రవాణాకు, బిజినెస్కు ఎంతో శక్తినిచ్చిన జంతువు గాడిదలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యధికంగా గాడిదలు రాజస్థాన్, మధ్యప్రధేశ్ లలో ఉండగా గడిచిన మూడు దశాబ్దాల్లో మధ్యప్రదేశ్ లో గాడిదల సంఖ్య 94 శాతం తగ్గి వాటి సంఖ్య దారుణంగా పడిపోయిందని జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్లో గాడిదల సంఖ్య ఆందోళనకరంగా తగ్గుముఖం పడుతుండటంపై చైనాయే కారణం అంటున్నారు గురుగ్రామ్ జంతు హక్కుల కార్యకర్తలు. గాడిదల సంఖ్య తగ్గడానికి చైనాకు సంబంధం ఏమిటీ.. ఎందుకు మధ్య ప్రదేశ్ లో గాడిదలు అంతరించి పోతున్న జంతువుగా ప్రకటించే పరిస్థితి వచ్చిందో తెలుసుకుందాం..
ఒకప్పుడు రాజస్థాన్తర్వాత అత్యధికంగా గాడిదలున్న రాష్ట్రం మధ్య ప్రదేశ్1997లో మధ్యప్రదేశ్ లోని 49వేల 289 గాడిదలున్నాయట. మధ్యప్రదేశ్లోని 55 జిల్లాలలో తొమ్మిది జిల్లాలలో ఒక్క గాడిద కూడా లేదని రిపోర్టులు చెబుతున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో ఆ రాష్ట్రంలో గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కేవలం 3వేల 052 గాడిదలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతలా గాడిద జాతి క్షీణించిపోవడానికి కారణం ఏంటో తెలుసా.. ?
మధ్యప్రదేశ్లో గాడిదలు అంతరించి పోవడానికి ఓ ప్రధాన కారణం చైనాయే అంటున్నారు అక్కడి జంతు హక్కుల కార్యకర్త కద్యన్. చైనాలో తయారు చేసే సాంప్రదాయ టానిక్స్, వయాగ్రాలాంటి మందులు ,యాంటీ ఏజింగ్ క్రీములలో ఉపయోగించే జెలటిన్ను తయారు పరిశ్రమల్లో గాడిద చర్మాలను ఉపయోగిస్తారట. చైనాలో ఎజియావో పరిశ్రమ వృద్ధి చెందడంతో గాడిద చర్మాలకు డిమాండ్ పెరిగిపోయింది. గాడిదలను మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు జంతు హక్కుల కార్యకర్తలు.
గాడిద జనాభాలో ఈ తీవ్రమైన క్షీణతను వివరించేందుకు అధికారిక అధ్యయనాలు లేనప్పటికీ..గురుగ్రామ్కు చెందిన జంతు హక్కుల కార్యకర్త నరేష్ కద్యన్ గాడిదలను తదుపరి అంతరించిపోతున్న జాతిగా ప్రకటించాలని పిలుపునిచ్చారు.
తాజా పశువుల జనాభా గణన కూడా గాడిదల జనాభా తగ్గిపోతుందని సూచించింది. మధ్యప్రదేశ్లో 3.75 కోట్ల జంతువులు ఉండగా..వీటిలో ఆవులు1.57 కోట్లు, గేదెల1.02 కోట్లు, మేకలు 1.09 కోట్లు, గొర్రెలు5.58 లక్షలు , గుర్రాలు 9,971, గాడిదలు, 3వేల052, కంచర గాడిదలు 972, ఒంటెలు 2వేల896 ,పందులు 89వేల177 ఉన్నాయని పశు జనాభా గణనలో తేలింది.