హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం అంశాలపై బుధవారం (మే 27) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్. గాంధీభవన్లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజారీ మధ్య వాగ్వాదం జరిగింది.
ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. మాట మాట పెరిగింది. ఈ క్రమంలోనే ఫిరోజ్ ఖాన్ను చెంపపై కొట్టి వెనక్కి తోసేశారు ఉస్మాన్ అల్ హజారీ. దీంతో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీహెచ్ను కూడా తోసేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ వాగ్వాదం జరిగింది.
సమీక్ష సమావేశంలో మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో ఈ గొడవ తలెత్తినట్లు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఉస్మాన్ హజ్రీ, ఫిరోజ్ ఖాన్ల రగడతో గాంధీ భవన్లో పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో సమీక్ష సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు మంత్రులు. మంత్రుల ముందే నేతలు బాహాబాహీ దిగడం గాంధీ భవన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
