
న్యూఢిల్లీ: అరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ శుక్రవారం తన దాదాపు రూ.500 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ఒక్కో షేరుకు రూ.210 నుంచి రూ.222 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 18న మొదలైన 20న ముగుస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ భాగం ఉండదు.
రూ.499.6 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ మాత్రమే ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ఎగువ ముగింపులో కంపెనీ విలువ దాదాపు రూ.1,800 కోట్లు. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధులు సమకూర్చడానికి, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్-ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టడానికి, దాని అనుబంధ సంస్థ అరిస్యూనిటర్న్ రీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుత వాటాదారుల నుంచి వాటా కొనుగోలుకు, అప్పు చెల్లించడానికి సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
అరిస్ ఇన్ప్రా సొల్యూషన్స్ బీ2బీ టెక్నాలజీ- ఆధారిత కంపెనీ. ఇది నిర్మాణ సామగ్రి సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయడం, డిజిటలైజ్ చేయడంపై దృష్టి సారిస్తుంది. కంపెనీ వివిధ నగరాల్లోని 963 పిన్ కోడ్లలో సేవలు అందిస్తుంది.