- కాశ్మీర్ ‘స్పెషల్ ’ కాదు
- ప్రెసిడెంట్ రూల్ ఎక్స్ టెన్షన్ కు ఆమోదం
- ఈసీ గ్రీన్ సిగ్నలిస్తే అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధమన్న హోం మంత్రి
కాశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెన్షన్తోపాటు జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు శుక్రవారం లోక్సభ ఆమోదం తెలిపింది. వీటిని ప్రవేశపెడుతూ షా ప్రసంగించారు.
న్యూఢిల్లీ: ‘‘జమ్మూకాశ్మీర్లో మూడో వంతు భూభాగం ఇండియాలో లేదు. ఒకప్పుడు కాశ్మీర్లో ఇండియా పేరు వినిపించకపోయేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్బోర్డులో ‘ఇండియా’ పదం కనిపించకుండా జాగ్రత్త పడేవాళ్లు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదా? పాకిస్థాన్పై ఇండియన్ ఆర్మీ పైచేయి సాధించిన దశలో నెహ్రూ సడన్గా కాల్పుల విరమణ ప్రకటించడం, ఆయన నిర్ణయాల వల్లే అక్కడ గత 70 ఏండ్లుగా కల్లోల పరిస్థితులు నెలకొనడం నిజం కాదా? ఇప్పటిదాకా జమ్మూకాశ్మీర్లో 132 సార్లు ప్రెసిడెంట్ రూల్ పెడితే, అందులో 93 సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని మర్చిపోయారా?” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించారు.
జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆర్నెల్లు పొడిగించే తీర్మానాన్ని శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆయన.. ప్రతిపక్ష కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. వేల మంది మరణాలకు నెహ్రూ విధానాలే కారణమని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో డెమోక్రసీని పునరుద్ధరించడం, టెర్రరిజాన్ని పారదోలడానికి బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రపతి పాలనలోనే అభివృద్ధి రెండింతలు పెరిగిందని, అంతమాత్రాన అసెంబ్లీ ఎన్నికలు జరుపకుండా ఉండలేమన్నారు. ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామన్నారు. కాశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి తీరుతామని షా మరోసారి స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెన్షన్ తీర్మానానికి లోక్సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పొలిటికల్ ఫాయిదా కోసమే అసెంబ్లీ ఎన్నికలు వాయిదావేసి, ప్రెసిడెంట్ రూల్ కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ విమర్శించారు. గతేడాది జూన్లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన గడువు.. జులై 2తో ముగియనుండటంతో దాన్ని మరో ఆర్నెల్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కొద్దిరోజుల కిందట నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కాశ్మీరియత్ను కాపాడేది మేమే
జమ్మూకాశ్మీర్ విషయంలో ఇన్సానియత్ (మానవత్వం), జుమ్హారియత్(ప్రజాస్వామ్యం), కాశ్మీరియత్(కశ్మీరీ కల్చర్) అనే మూడు సూత్రాల ఆధారంగా అక్కడి ప్రజల మనసులు గెలవొచ్చన్న అటల్ బిహారీ వాజపేయి ఆలోచనను మోడీ సర్కార్ అనుసరిస్తున్నదని, గత ఐదేండ్లలో జరిగిన అభివృద్ధే అందుకు నిదర్శనమని, రూ.2,307కోట్లతో సెక్యూరిటీ ప్రమాణాల్ని పెంచామని, నిర్ణీత కాలంలో 15వేల బంకర్లను నిర్మించామని అమిత్ షా గుర్తుచేశారు. “ఇన్సానియత్లో భాగంగానే కాశ్మీరీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పెద్ద సంఖ్యలో టాయిలెట్లు, 1.42లక్షల ఇండ్లు కట్టించాం.
ప్రజాస్వామ్యం విషయంలోనూ ఎవరికీ సందేహాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నికల హింసకు కేరాఫ్గా ఉన్న జమ్మూకాశ్మీర్లో దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్ని, అదికూడా శాంతియుతంగా నిర్వహించగలిగాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. కలిసికట్టుగా ఉండటమే అసలైన కాశ్మీరియత్(కాశ్మీరీ సంస్కృతి) తప్ప, దేశాన్ని విరోధించడం కాదు. గత ప్రభుత్వాలు వేల మంది పండిట్లను వెళ్లగొట్టాయి. మేం వాళ్లకు పునరావాసం కల్పిస్తున్నాం. కశ్మీరియత్ను కొంచెం కూడా డైల్యూట్ కానివ్వం”అని అమిత్ షా చెప్పారు.
మోడ్రన్ ఇండియా ఆర్కిటెక్ట్ నెహ్రూనే..
జమ్మూకాశ్మీర్ పై చర్చ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) ఎంపీ ఎన్ కే ప్రేమచంద్ ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. రిజర్వేషన్ బిల్లును సమర్థించి న ఆయన, ప్రెసిడెంట్ రూల్ ఎక్స్ టెన్షన్ ను వ్యతిరేకించారు. ఒకేసారి ఎన్నికల్ని సమర్థిం చే బీజేపీ..జమ్మూకాశ్మీర్ లో లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోయిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని నెహ్రూపై అమిత్ షా కామెంట్లను ప్రేమచంద్ తప్పుపట్టారు . నెహ్రూ.. మోడ్రన్ ఇండియా ఆర్కిటెక్ట్ అని, ప్రపంచంలోనేబెస్ట్ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ ను అందించిన ఘనత కూడా ఆయనదేనని గుర్తుచేశారు.