మోడీని కలిసిన ఆల్ట్​మాన్

మోడీని కలిసిన ఆల్ట్​మాన్
  • చాట్​జీపీటీకి ఇండియాలో ఊహించని ఆదరణ
  • అధికారులతోనూ సమావేశం
  • శామ్​ ఆల్ట్​మాన్​ వెల్లడి

న్యూఢిల్లీ: మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) కంపెనీ ఓపెన్​ఏఐ సీఈఓ శామ్​ ఆల్ట్​మాన్​ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. మీటింగ్​ అద్భుతంగా జరిగిందని, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​పై మోడీ చాలా ఆసక్తి చూపించారని ఆయన​ వెల్లడించారు. కొత్తగా తేనున్న డిజిటల్​ ఇండియా బిల్లులో ఏఐ నియంత్రణ కోసం ప్రభుత్వం రూల్స్​ తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఏఐ తెచ్చే అవకాశాలు, రెగ్యులేషన్​ ఎలా ఉండాలనే అంశాలు కూడా మోడీతో మీటింగ్​లో చర్చకు వచ్చాయని ఆల్ట్​మాన్​ చెప్పారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​కు ఇండియాలో ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై ఫోకస్​ పెట్టినట్లు పేర్కొన్నారు.

ఓపెన్​ఏఐ తెచ్చిన ఏఐ ప్రొడక్ట్​ చాట్​జీపీటీకి ఇండియాలో ఊహించనంత ఆదరణ లభిస్తోందని శామ్​ ఆల్ట్​మాన్​ ఈ సందర్భంగా తెలిపారు. ప్రాధమిక దశలోనే చాట్​జీపీటీని వాడేందుకు ఇష్టం చూపించారని వివరించారు. యూజర్ల ఆసక్తి ఆశ్చర్యం కలిగిస్తోందని ఆల్ట్​మాన్​ పేర్కొన్నారు. ఇండియాలో సుడిగాలి పర్యటనకు వచ్చిన శామ్​ ఆల్ట్​మాన్​ ప్రభుత్వంలోని సీనియర్​ అధికారులతో సమావేశమై మన దేశం చేపడుతున్న ఏఐ ప్రోగ్రామ్​పైనా చర్చించారు. ఏఐ రెగ్యులేషన్​ కు ఇంటర్నేషనల్​ అథారిటీ ఒకటి ఉండాలని గతంలో ఆయన​ సలహా ఇచ్చారు. అయితే మన ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ ఈ విషయంలో ఆయనతో విభేదించారు. ఏఐని ఎలా రెగ్యులేట్​ చేయాలనే అంశంలో మన వైఖరి మనకి ఉంటుందని రాజీవ్​ చంద్రశేఖర్​ స్పష్టం చేశారు.