- ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాస్
- భారీగా పడిపోయిన ఇండెక్స్లు
ముంబై: బీఎస్ఈ బెంచ్మార్క్ సెన్సెక్స్ 790 పాయింట్లకు పైగా పతనమవడంతో బుధవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర క్షీణించింది. ఇది 790.34 పాయింట్లు క్షీణించి 72,304.88 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 872.93 పాయింట్లు పడి 72,222.29 వద్దకు చేరుకుంది. బీఎస్ఈ -లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.6,02,338.56 కోట్లు తగ్గి రూ.3,85,97,298.49 కోట్లకు చేరింది.
"గురువారం ఎఫ్ అండ్ వో గడువు ముగియడానికి ముందు పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలను ఆశ్రయించారు. బలహీనమైన ఆసియా మార్కెట్ సంకేతాలు, డౌ ఫ్యూచర్స్ ప్రతికూల ప్రారంభం నేపథ్యంలో బెంచ్మార్క్ సెన్సెక్స్ కీలకమైన 73 వేల మార్క్ దిగువన ముగిసింది. రోజంతా ప్రాఫిట్బుకింగ్ జరిగింది’’ అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. రిలయన్స్, బ్యాంక్ స్టాక్స్లో అమ్మకాల వల్ల కూడా సూచీలు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ కంపెనీలలో పవర్ గ్రిడ్ అత్యధికంగా 4.43 శాతం పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం నష్టపోయింది.
మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, జేఎస్డబ్ల్యు స్టీల్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, రిలయన్స్ టైటాన్ షేర్లూ నష్టాలను మూటగట్టుకున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎయిర్టెల్ లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ గేజ్ 1.94 శాతం క్షీణించగా, మిడ్క్యాప్ ఇండెక్స్ 1.82 శాతం తగ్గింది. అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. యుటిలిటీస్ 2.82 శాతం, చమురు గ్యాస్ 2.19 శాతం, రియల్టీ 2.12 శాతం, టెలికమ్యూనికేషన్ 1.92 శాతం, సేవలు 1.89 శాతం, కమోడిటీలు 1.85 శాతం క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్ లాభాలతో స్థిరపడగా, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎఫ్ఐఐలు మంగళవారం రూ. 1,509.16 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.