కేసీఆర్​ అంటే 'కాళేశ్వరం' చంద్రశేఖరరావు: ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్​ అంటే 'కాళేశ్వరం' చంద్రశేఖరరావు: ఎమ్మెల్సీ కవిత
  • కాంగ్రెస్​ హయాంలో సాగునీరూ రాలే..

దేశాన్ని 50 ఏళ్ల పాటు, ఉమ్మడి రాష్ర్టాన్ని ఓ దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ర్టానికి సాగు, తాగు నీటిని అందించలేకపోయిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ నిజామాబాద్​లో సాగునీటి దినోత్సవం జరిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్​ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​ తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరని, కాంగ్రెస్​ హయాంలో  జరిగిన అభివృద్ధి ఏంటో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. బీఆర్ఎస్​ పాలనలో సాగు, తాగుకు నీరు పుష్కలంగా అందిస్తున్నామని చెప్పారు.  సమైక్యపాలనలో జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. 

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి

కేసీఆర్​ అంటే అందరూ కల్వకుంట్ల చంద్రశేఖర్​అనేవారని ఇప్పుడు కాళేశ్వరం చంద్రశేఖర్​ అంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​గా కాళేశ్వరం ఘనతకెక్కిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా ప్రాజెక్టుకి నిధులు, జాతీయ హోదా ఇవ్వక పోవడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్​ పాలనలో కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకునే వారని అలాంటి వ్యక్తులు కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.