మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందా అనే అనుమానం వచ్చే మరో ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఈ మధ్యే ఓ రాష్ట్రంలో మృతి చెందిన తన కుమారుడిని బస్సుల్లో తీసుకెళ్లిన తండ్రి ఘటన మరువకముందే మరోటి జరగడం బాధాకరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్, తన కుమార్తె మాధురి కి అనారోగ్యంగాఉండటంతో షాడోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అక్కడ చికిత్స పొందుతూ మాధురి మరణించింది. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్ని అడగ్గా వాళ్ల ఊరు 70 కి.మీ. ల దూరంలో ఉండటంతో, 15 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు వాహనాలు అందుబాటులో లేవని చెప్పారు.
మృతదేహం తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్ఎక్కువగా డబ్బులు అడగటంతో తండ్రి దిక్కు తోచని స్థితిలో బంధువు సాయంతో తన బైక్ పై మృతదేహం తీసుకెళ్లారు. తండ్రి దయనీయ పరిస్థితిని పట్టించుకోకుండా అధికారుల చూపించిన అలసత్వం, మానవత్వం లేని మనస్సును పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న షాడోల్ కలెక్టర్ వందనా అంబులెన్స్ని ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు.