నేటి (జూన్ 26) నుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ అమ్మవారికి.. తొలి బోనంతో మొదలుకానున్న ఉత్సవాలు

నేటి (జూన్ 26) నుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ అమ్మవారికి.. తొలి బోనంతో మొదలుకానున్న ఉత్సవాలు

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఆషాఢ బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక- మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాతే జంట నగరాల్లో బోనాలు మొదలవుతాయి.  

ఘనంగా మెట్ల పూజ..
బుధవారం అమావాస్య సందర్భంగా గోల్కొండ కోటలో మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ ఈవో వసంత, ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయానికి చేరుకునే ప్రతి మెట్టుకు మహిళలు బొట్టు పెట్టారు. అమ్మవారిని దర్శించుకున్నారు. వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం లంగర్‌‌‌‌‌‌‌‌హౌస్​నుంచి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. 

అమ్మవారికి తొమ్మిది బోనాలు..
గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 బోనాలు సమర్పిస్తారు. గురువారం సమర్పించే తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నగరమంతా బోనాలు నిర్వహించాక చివరకు జులై 24న సమర్పించే 9వ బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రెండో పూజ ఈ నెల 29న,  మూడో పూజ జులై 3న , నాలుగో పూజ 6న, 5వ పూజ 10న, 6వ పూజ 13న, 7వ పూజ 17న, 8వ పూజ 20న, 9వ పూజ 24న ఉంటుంది.  కాగా, జులై 13న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అమ్మవారికి పట్టి వస్త్రాలు సమర్పించనున్నారు.