బీఆర్ఎస్ లో ట్యాపింగ్ టెన్షన్!! పద్మాదేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్యకు సిట్ నోటీసులు

బీఆర్ఎస్ లో  ట్యాపింగ్ టెన్షన్!!  పద్మాదేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్యకు సిట్ నోటీసులు
  • ఇంకా ఎవరి ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు..?
  • కారు పార్టీలో అంతర్గతంగా చర్చ
  •  15 రోజుల వ్యవధిలో 4,013 ఫోన్ల ట్యాపింగ్
  • అసెంబ్లీ ఎన్నికల టైంలోనే ఎక్కువ..
  • 618 మంది లీడర్లు, జర్నలిస్టులు, ఆఫీసర్లు
  •  అందరి వాంగ్మూలాలను రికార్డు చేయనున్న సిట్


హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ టెన్షన్ పట్టుకుంది. కేసీఆర్ సొంత పార్టీ నేతలను కూడా  నమ్మలేదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023  నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇందులో  మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సిట్ నిర్ధారణకు వచ్చింది. విచారణకు  రావాలంటూ వీళ్లిద్దరికి ఇవాళ సిట్ నోటీసులు  జారీ చేసింది. దీంతో గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది.  ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో అనే అనుమానాలు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.  

ALSO READ | స్థానిక సంస్థ ఎన్నికల అంశంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీపీసీసీ చీఫ్

అసెంబ్లీ ఎన్నికల  సమయంలో 4013 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇందులో 618 రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. వీరిలో ఆరుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ 618 మంది లో ఇప్పటి వరకు  228 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. మిగతా వారి నుంచి కూడా స్టేట్ మెంట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ నిర్ధారణకు వచ్చింది. వీరితో పాటు ఐఏఎస్ అధికారులు రోనాల్డ్  రాస్, గౌతం ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. వీళ్లందరినీ విచారణకు పిలిచి స్టేట్ మెంట్లు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతోంది. 

ఇతర పార్టీల్లోని కీలక నేతలే టార్గెట్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. అప్పటి పీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లతోపాటు అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయి. ప్రస్తుత సమాచార శాఖ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయి