వర్ధమాన్‎ను పట్టుకున్న పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఎన్‌కౌంటర్‌లో మృతి

వర్ధమాన్‎ను పట్టుకున్న పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఎన్‌కౌంటర్‌లో మృతి

ఇస్లామాబాద్: 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‎ను పట్టుకున్న పాకిస్థాన్ ఆర్మీ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) మరణించాడు. పాకిస్థాన్‎లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ఉగ్రవాదులు అబ్బాస్ షాను చంపేశారు. చక్వాల్‌ ప్రాంతానికి చెందిన మేజర్ మోయిజ్ అబ్బాస్ షా పాక్ సైన్యంలోని ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) సభ్యుడు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో షా మరణించాడు. 

కాగా, 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఉగ్రవాదులు నలభై మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్‎లోని బాలాకోట్‌లో ఉగ్రశిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. ఉగ్రవాదులే  టార్గెట్‎గా మిరాజ్‌ యుద్ధ విమానాలతో భారత్‌ ఎయిర్‌ఫోర్స్‌ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో భారత్ తరుఫున వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వీరోచితంగా పోరాడాడు. పాకిస్థాన్ యుద్ధ విమానాలను నేలమట్టం చేశాడు. 

ఈ క్రమంలోనే పాక్ సైనికులకు వర్ధమాన్ దొరికిపోయాడు. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దిగగా.. వెంటనే పాక్ సైనికులు వర్ధమాన్‎ను బంధించారు. వర్ధమాన్ బంధించడంలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కీలక పాత్ర పోషించారు. దీంతో వర్ధమాన్‎తో పాటు మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కూడా అప్పట్లో వార్తల్లో నిలిచారు. చివరకు పాకిస్థాన్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదుల చేతిలోనే అతడు మృతి చెందాడు.