
ఇస్లామాబాద్: 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను పట్టుకున్న పాకిస్థాన్ ఆర్మీ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) మరణించాడు. పాకిస్థాన్లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ఉగ్రవాదులు అబ్బాస్ షాను చంపేశారు. చక్వాల్ ప్రాంతానికి చెందిన మేజర్ మోయిజ్ అబ్బాస్ షా పాక్ సైన్యంలోని ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) సభ్యుడు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో షా మరణించాడు.
కాగా, 2019లో జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జైషే ఉగ్రవాదులు నలభై మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రశిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఉగ్రవాదులే టార్గెట్గా మిరాజ్ యుద్ధ విమానాలతో భారత్ ఎయిర్ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో భారత్ తరుఫున వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వీరోచితంగా పోరాడాడు. పాకిస్థాన్ యుద్ధ విమానాలను నేలమట్టం చేశాడు.
ఈ క్రమంలోనే పాక్ సైనికులకు వర్ధమాన్ దొరికిపోయాడు. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దిగగా.. వెంటనే పాక్ సైనికులు వర్ధమాన్ను బంధించారు. వర్ధమాన్ బంధించడంలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కీలక పాత్ర పోషించారు. దీంతో వర్ధమాన్తో పాటు మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కూడా అప్పట్లో వార్తల్లో నిలిచారు. చివరకు పాకిస్థాన్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదుల చేతిలోనే అతడు మృతి చెందాడు.