
తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. గత కొన్నాళ్లుగా అధికార టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న ఆయన చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు. గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్నప్పటికీ.. పార్టీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
►ALSO READ | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు
బుధవారం (జూన్ 25) వైయస్ జగన్ ఆధ్యర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాధ్ రెడ్డి తదితరులు ఉన్నారు.