గోల్కొండ బోనాలు షురూ.. పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర మంత్రులు

గోల్కొండ  బోనాలు షురూ.. పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర మంత్రులు

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్​లో ఆషాఢం బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుమ్మరులు తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం లంగర్ హౌస్ చౌరస్తా లోని అమ్మవారి రథంలో ఉన్న చిత్రపటానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రుల సమక్షంలోనే పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ నిర్వాహకులు బంగారు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోటలోని అమ్మవారి గుడి వరకు రథం, తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభించారు.

 డప్పు చప్పుళ్లు, శివ సత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో కోలాహలంగా ఊరేగింపు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఊరేగింపు గోల్కొండలోని చోటా బజార్​కు చేరుకుంది. పూజారి దిగంబరం ఇంట్లోని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ విగ్రహాలను రథం, తొట్టెలతో పాటు ఊరేగింపుగా గోల్కొండ కోటపైకి తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు తొట్టెలను అమ్మవారికి సమర్పించారు. బోనాలను చూసేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు కోటకు క్యూ కట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆరెళ్ల జగదీశ్, సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.