
రాజ్గిర్ (బిహార్): ఆసియా కప్ హాకీ టోర్నీలో ఇండియా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ సూపర్ షోతో.. పూల్–ఎలో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఇండియా 3–2తో జపాన్పై గెలిచింది. ఫలితంగా ఆరు పాయింట్లతో సూపర్–4 స్టేజ్కు అర్హత సాధించింది. హర్మన్ప్రీత్ (5, 46వ ని) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మల్చగా, మన్దీప్ సింగ్ (4వ ని) ఫీల్డ్ గోల్తో ఆకట్టుకున్నాడు. జపాన్ తరఫున కొసెయ్ కవాబె (38, 58వ ని) రెండు గోల్స్ కొట్టాడు. ఈ గ్రూప్లో చైనా, జపాన్ చెరో పాయింట్తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సోమవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇండియా.. కజకిస్తాన్తో తలపడుతుంది. జపాన్.. చైనా మధ్య జరిగే మ్యాచ్ విన్నర్ సూపర్–4 స్టేజ్కు క్వాలిఫై అవుతాడు.
ఆద్యంత ఆధిపత్యం..
చైనాతో జరిగిన మ్యాచ్తో పోలిస్తే ఇందులో ఇండియా ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. వేగంగా మంచి సమన్వయంతో కదిలిన ప్లేయర్లు తరచుగా ప్రత్యర్థి సర్కిల్లోకి దూసుకెళ్లారు. ఫలితంగా రెండో నిమిషంలోనే ఇండియాకు గోల్ చేసే చాన్స్ వచ్చింది. కానీ హర్మన్ప్రీత్, మన్దీప్ సమన్వయంతో కొట్టిన షాట్ వైడ్గా వెళ్లింది. అయితే గోల్ కోసం ఇండియా ఎక్కువసేపు వేచి చూడాల్సిన అవసరం రాలేదు. మరో రెండు నిమిషాల్లోనే మన్దీప్ కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్తో ఆధిక్యాన్ని అందించాడు. రెండు వైపుల నుంచి హర్మన్ప్రీత్, జర్మన్ప్రీత్ సింగ్ షార్ట్ పాస్లతో వేగంగా కదులుతూ బాల్ను గోల్ పోస్ట్ ముందు సుఖ్జీత్కు అందించారు. దీన్ని సుఖ్జీత్ వైడ్ పాస్తో మన్దీప్ ఇవ్వగా దాన్ని అతను.. ఇద్దరు డిఫెండర్లను, గోల్ కీపర్ను తప్పించి గోల్గా మలిచాడు. ఐదో నిమిషంలో రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా హర్మన్ప్రీత్ ఒక్కదాన్ని సద్వినియోగం చేశాడు. ఫలితంగా ఇండియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మరో రెండు నిమిషాల్లో రెండో క్వార్టర్ ముగుస్తుందనగా జపాన్కు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని ఇండియా గోల్ కీపర్ క్రిషన్ బహుదూర్ పాఠక్ అడ్డుకున్నాడు. రెండో క్వార్టర్లోనూ జపాన్కు పెనాల్టీ చాన్స్లు వచ్చినా.. పాఠక్ అడ్డు గోడను తప్పించలేకపోయారు. హాఫ్ టైమ్కు మూడు నిమిషాల ముందు లభించిన పెనాల్టీని ఇండియా ఉపయోగించుకోలేదు. ఎండ్లు మారిన తర్వాత సుఖ్జీత్, మన్దీప్ ఇన్సైడ్ సర్కిల్లో షార్ట్ పాస్లు ఆడుతూ జపాన్ గోల్ కీపర్ను తప్పించే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో 38వ నిమిషంలో కవాబె దగ్గర్నించి కొట్టిన షార్ట్ పాస్ను పాఠక్ అడ్డుకోలేకపోయాడు. ఫలితంగా ఇండియా ఆధిక్యం 2–1కి తగ్గింది. వెంటనే తేరుకున్న ఇండియా ఎదురుదాడికి దిగింది. సరిగ్గా ఎనిమిది నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీని హర్మన్ప్రీత్ బలమైన లో ఫ్లిక్తో జపాన్ గోల్ పోస్ట్ను ఛేదించాడు. లీడ్ 3–1కి పెరిగింది. 49వ నిమిషంలో జపాన్కు పెనాల్టీ లభించినా ఫలితం రాలేదు. అటాకింగ్ గేమ్తో ఇండియా పెనాల్టీలను రాబట్టినా గోల్స్గా మల్చలేకపోయింది. ముగింపుకు రెండు నిమిషాల ముందు కవాబె రెండో గోల్ కొట్టినా విజయాన్ని అందించలేకపోయాడు.
చైనా 13 గోల్స్
పూల్–ఎలో జరిగిన మరో మ్యాచ్లో చైనా 13–1తో కజకిస్తాన్ను ఓడించింది. మ్యాచ్ మొదలైన 12 సెకన్లలో కజకిస్తాన్ పెనాల్టీని సాధించింది. దీన్ని అజిమ్టే డ్యూయిసెంగాజీ గోల్గా మలిచాడు. 0–1తో వెనుకబడ్డ చైనా ఎదురుదాడులతో గోల్స్ వర్షం కురిపించింది. కజక్ డిఫెన్స్ను కకావికలం చేసి 13 గోల్స్ కొట్టింది. చైనా తరఫున డు షిహావో (10, 53వ ని), క్విన్ చెన్ (13వ ని), చాంగ్లియాంగ్ లిన్ (15, 39వ ని), బెన్హాయ్ చెన్ (29, 56వ ని), యువాన్లిన్ లు (31, 42, 44వ ని), జీషెంగ్ గావో (33వ ని), జియాలాంగ్ గావో (41, 58వ ని) గోల్స్ చేశారు.