
చెన్నై: ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా 3–2తో కొరియాకు చెక్ పెట్టింది. ఇండియా తరఫున నీలకంఠ శర్మ (6వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (23వ ని.), మన్దీప్ సింగ్ (33వ ని.) గోల్స్ చేయగా, కిమ్ సంగ్హుయాన్ (12వ ని.), యాంగ్ జిహున్ (58వ ని.) కొరియాకు గోల్స్ అందించారు. తొలి క్వార్టర్లో ఇరుజట్లు చెరో గోల్ చేసినా... తర్వాతి రెండు క్వార్టర్స్లో ఇండియా పెనాల్టీలను బాగా ఉపయోగించుకుంది. అయితే ఆఖరి క్వార్టర్లో కొరియా నుంచి ఎదురుదాడి మొదలైంది.
చివర్లో గోల్ కొట్టి కాస్త ఉత్కంఠ రేకేత్తించినా ఇండియా డిఫెన్స్ మరో గోల్ కాకుండా అడ్డుకుంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు, ఓ డ్రాతో ఇండియా 10 పాయింట్లు సాధించింది. మరో మ్యాచ్లో మలేసియా 3–1తో జపాన్ను ఓడించి సెమీస్లోకి ప్రవేశించింది. జజ్లాన్ నజ్మీ (13వ ని.), హసన్ అజున్ (37వ ని.), సిల్వెరియస్ షెల్లో (59వ ని.) గోల్స్ చేయగా, నివా టకుమా (59వ ని.) జపాన్కు ఏకైక గోల్ అందించాడు.
ఇక చైనాతో జరిగిన మ్యాచ్లో 2–1తో నెగ్గిన పాకిస్తాన్ సెమీస్ రేస్లో కొనసాగుతున్నది. పాక్ ప్లేయర్లు మహ్మద్ ఖాన్ (20వ ని.), అఫ్రాజ్ (39వ ని.) గోల్స్ చేయగా, గావో జిషెంగ్ (33వ ని.) చైనాకు గోల్ సాధించిపెట్టాడు.