దహెగాం/నేరడిగొండ, వెలుగు: పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలని ఆసిఫాబాద్ జిల్లా పశువైద్యాధికారి సురేశ్ సూచించారు. దహెగాం మండలంలోని బీబ్రా గ్రామంలో బుధవారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరం బారిన పడి నీరసంగా ఉంటాయన్నారు.
పాలు తాగే దూడలు మరణించే అవకాశం ఉందని, పశువుల యజమానులు నిర్లక్ష్యం వహించకుండా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు రమేశ్, శ్రావణ్ కుమార్,మాజీ సర్పంచ్ బండ కృష్ణ, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నేరడిగొండ మండలం గాజిలిలో..
రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశువైద్యాధికారి రాథోడ్ జీవన్ సూచించారు. నేరడిగొండ మండలంలోని గాజిలిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలం పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ప్రభుత్వం ముందస్తుగా టీకాలు వేస్తోందని తెలిపారు. పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
