అస్సాం గ్యాస్ లీకేజ్: ఇద్దరు ఫైర్ ఫైటర్స్ మృతి, ఒకరు గల్లంతు

అస్సాం గ్యాస్ లీకేజ్: ఇద్దరు ఫైర్ ఫైటర్స్ మృతి, ఒకరు గల్లంతు

గుహవాటి: అస్సాం, తినుస్కియా జిల్లాలోని ఓ ఆయిల్ ఫీల్డ్‌లో మంగళవారం మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. బాగ్జన్ ఆయిల్ ఫీల్డ్స్‌లో భాగమైన ఓ చమురు బావి మే 27న దెబ్బతింది. అప్పటి నుంచి సదరు ఆయిల్​ఫీల్డ్‌ నుంచి గ్యాస్ వెలువడుతూనే ఉంది. దీంతో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఫైర్‌‌ఫైటర్స్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో బుధవారం ఇద్దరు ఫైర్‌‌ ఫైటర్స్ మృత దేహాలను రికవర్ చేసుకున్నామని.. ఇంకొకరి ఆచూకీ తెలియరాలేదని అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ కృష్ణ తెలిపారు. మంటలను ఆర్పేందకు మరో నాలుగు వారాల సమయం పట్టొచ్చని ఆయిల్ ఇండియా లిమిటెడ్ అధికార ప్రతినిధి త్రిదిబ్ హజారికా తెలిపారు.

‘మంటలను ఆర్పేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అలర్ట్ టీమ్‌ సూచనల ప్రకారం ‘క్యాపింగ్ స్టాక్ గైడ్ రైల్’ పద్ధతిని ఓఎన్‌జీసీ, ఆయిల్ టీమ్స్‌ ఫాలో అయితున్నాయి’ అని త్రిదిప్ హజారికా చెప్పారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన 15 మంది అగ్ని మాపక సిబ్బందితోపాటు ఓఎన్‌జీసీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్), డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీసెస్ మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో సుమారు 50 ఇళ్లు, చెట్లు దగ్ధమవ్వడంతోపాటు వెట్‌ల్యాండ్స్‌ దెబ్బతిన్నాయని సమాచారం. సదరు ప్రమాదం జరిగిన ఏరియాలో ఎన్‌డీఆర్‌‌ఎఫ్ టీమ్‌తోపాటు ఆర్మీ, పారామిలిటరీ ఫోర్సెస్‌ను మోహరించారు. సమీప గ్రామాల నుంచి సుమారు 3 వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు.